ఫిలించాంబర్‌ ఎదుట ‘నానిగాడు’ హీరో ఆందోళన

11 Dec, 2019 10:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌‌: సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్న సమయంలో తన చిత్రాన్ని యూట్యూబ్‌లో పెట్టారని ఆరోపిస్తూ ‘నానిగాడు’ చిత్ర హీరో దుర్గాప్రసాద్‌ మంగళవారం ఫిలించాంబర్‌ ఎదుట ఆందోళనకు దిగాడు. రూ.40 లక్షలు ఖర్చు పెట్టి నానిగాడు సినిమా తీస్తే సినిమా విడుదల కాకముందే యూట్యూబ్‌లో పెట్టారని దీని వల్ల తమకు ఎంతో నష్టం వాటిల్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. సినిమా విడుదలకు సెన్సార్‌ బోర్డు యూ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చిందని చిత్ర యూనిట్‌ తెలిపింది.

సినిమా విడుదల కాకముందే సినిమా మొత్తాన్ని యూట్యూబ్‌లో పెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లింక్‌ను వెంటనే తొలగించి తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఫిలించాంబర్‌ ఎదుట చిత్ర యూనిట్‌ మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. కాగా, బుధవారం ఉదయం మరోసారి ఫిలించాంబర్‌ వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.


ఆందోళన చేస్తున్న  దుర్గాప్రసాద్‌ 

మరిన్ని వార్తలు