పదేళ్ల పాటు గుర్తుండే సినిమా ఇది – మారుతి

29 Jul, 2017 00:59 IST|Sakshi
పదేళ్ల పాటు గుర్తుండే సినిమా ఇది – మారుతి

‘‘గల్ఫ్‌’ సినిమా కోసం సునీల్‌కుమార్‌ రెడ్డిగారు ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. ఒక సమస్యను  డిస్కస్‌ చేయడానికి, స్క్రీన్‌పైకి తీసుకు రావడానికి ఆయన ముందుంటారు. సునీల్‌గారు మన ఇండస్ట్రీలో ఉండటం గర్వకారణం. ప్రేక్షకులకు పదేళ్ల పాటు గుర్తుండే సినిమా ‘గల్ఫ్‌’’ అని దర్శకుడు మారుతి అన్నారు. చేతన్‌ మద్దినేని, డింపుల్‌ హీరోహీరోయిన్లుగా పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్‌. రామ్‌కుమార్‌ నిర్మించిన చిత్రం ‘గల్ఫ్‌’. ప్రవీణ్‌ ఇమ్మడి స్వరపరచిన ఈ చిత్రం పాటలను మారుతి విడుదల చేశారు. నటుడు ఎల్బీ శ్రీరాం మాట్లాడుతూ– ‘‘నాకు వచ్చిన నాలుగు నంది అవార్డుల్లో రెండు సునీల్‌కుమార్‌గారి ‘సొంతూరు’ సినిమాకు వచ్చినవే. ‘గల్ఫ్‌’ కోసం ఆయన రెండేళ్లు కష్టపడి, రెండున్నర గంటల సినిమాగా రూపొందించారు’’ అన్నారు.

‘‘ఈ సినిమా ప్రయాణంలో సపోర్ట్‌ చేసిన నా మిత్రులు, చిత్ర యూనిట్‌కి థ్యాంక్స్‌. ఈ చిత్రంలోని పాటలు అందరికీ నచ్చుతాయి’’ అన్నారు సునీల్‌కుమార్‌. ‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతోంది. త్వరలోనే ‘గల్ఫ్‌’ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. చేతన్‌ మద్దినేని, డింపుల్, ప్రవీణ్‌ ఇమ్మడి, నటుడు నాగినీడు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యస్‌. వి. శివరాం, మాటలు: పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు: డాక్టర్‌ ఎల్‌. ఎస్‌. రావు, విజయ్, రాజా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బి. బాపిరాజు.