కరోనా కారణంగా సినిమాల షూటింగ్స్ని నిలిపివేస్తున్నట్లు ఈ నెల 15న తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. 24 శాఖలు తమ విధులను ఈ నెల 21 వరకు తక్షణం ఆపేయాల్సిందిగా మండలి కోరింది. ఇప్పుడు 24 శాఖల వారితో సంప్రదించి మరో కీలక నిర్ణయాన్ని శుక్రవారం విడుదల చేశారు. 21 వరకు పెట్టిన రద్దును మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తుర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చలన చిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు పేర్కొన్నారు.