ఆంధ్రా మీల్స్‌ చాలా కారం కానీ..

7 Jan, 2018 00:30 IST|Sakshi
జ్ఞానవేల్‌ రాజా, వంశీ, విఘ్నేష్‌ శివన్, రమ్యకృష్ణ, కీర్తీ సురేశ్, సూర్య, అల్లు అరవింద్‌

‘‘సూర్యతో నాకు ‘గజిని’ సినిమా నుంచి అనుబంధం కొనసాగుతోంది.  మా కాంబినేషన్‌లో సినిమా చేయాలని ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నాం కానీ కుదరడంలేదు. త్వరలో అవుతుందనుకుంటున్నాను. కీర్తీ సురేష్‌ నా స్నేహితుడి కూతురు. రమ్యకృష్ణ నా హీరోయిన్‌. నేను నిర్మించిన సినిమాల్లో యాక్ట్‌ చేశారు. తమిళంలో జ్ఞానవేల్‌ రాజాగారిది పెద్ద బ్యానర్‌. వంశీకు సినిమా అంటే పిచ్చి. సినిమా తీసి, అమ్ముకొని  డబ్బులు చేసుకొని వెళ్లిపోయేవాళ్లు చాలామంది ఉన్నారు కానీ నిలబడి తీసి, దమ్ముతో ఆడించే తక్కువమందిలో వంశీ ఒకడు.

అందుకే తనంటే నాకు ఇష్టం. సినిమాకు వర్క్‌ చేసిన అందరికీ నా అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. సూర్య, కీర్తీ సురేష్‌ జంటగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘తానా సేంద కూట్టమ్‌’ చిత్రాన్ని తెలుగులో యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌లు ‘గ్యాంగ్‌’ పేరుతో రిలీజ  చేస్తున్నారు. అనిరుద్‌ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగింది. సూర్య మాట్లాడుతూ– ‘‘మన స్కూల్‌లో, కాలేజ్‌లో, ఆఫీస్‌లో ఇలా ప్రతి చోటా మనకు ఒక గ్యాంగ్‌ ఉంటుంది. గ్యాంగ్‌ మన లైఫ్‌లో ఒక కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ సినిమాతో యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌ మా గ్యాంగ్‌లో మెంబర్స్‌ అయ్యారు. అల్లు అరవింద్‌గారు ‘గజిని’ సినిమా నుంచి మా గ్యాంగ్‌లో ఉన్నారు. ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. తమిళ ఫ్లేవర్‌ కనిపిస్తే క్షమించండి. కుటుంబం అంతా చూసే చిత్రం అవుతుంది’’ అన్నారు. ‘‘ఆంధ్రా మీల్స్‌ చాలా కారం, కానీ.. సినిమాపై మీ (ప్రేక్షకులు) ప్రేమ అపారం. అందరూ గ్యాంగ్‌గా వచ్చి ఈ సినిమాను చూడండి’’ అన్నారు దర్శకుడు. ఈ వేడుకలో దర్శకుడు మారుతి, నటి రమ్యకృష్ణ, కథానాయిక కీర్తీ సురేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు