‘విశ్వాసం’ కాంబో రిపీట్‌ 

28 Mar, 2020 11:48 IST|Sakshi

విశ్వాసం కాంబో రిపీట్‌ కానుందా. దీనికి కోలీవుడ్‌ నుంచి అవుననే బదులు వస్తోంది. అజిత్‌ ప్రస్తుతం వలిమై చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హ్యూమాఖురేషీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. దీనికి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అజిత్‌ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. దీంతో అజిత్‌ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. కాగా, ఇటీవల  సూర్య హీరోగా సూరైర్‌ పోట్రు చిత్రాన్ని తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధాకొంగర దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరిగింది.

కాగా, తాజాగా,  అజిత్‌ తో కొత్త చిత్రానికి చిరుతై శివ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జోరందుకుంది. వీరి కాంబినేషన్‌ లో ఇంతకు ముందు వేదాళం, వీరం, వివేకం, విశ్వాసం ఇలా నాలుగు హిట్‌ చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కాంబో అయిదో చిత్రానికి సిద్ధమవుతోంది. ఇది చారిత్రక కథాంశంతో తెరకెక్కబోతుందని తెలిసింది. దీనికి ఓ ప్రముఖ రచయిత కథను తయారు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.

అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం దర్శకుడు చిరుతై శివ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా అన్నాత్త చిత్రాన్ని తెరెక్కిస్తున్న విషయం తెలిసిందే. నటి నయనతార, కుష్బూ, మీనా, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణదశలో ఉంది. ఈ చిత్రం తర్వాత అజిత్‌తో దర్శకుడు చిరుతై శివ చేసే చిత్రం ప్రారంభమవుతుందని సమాచారం.   

మరిన్ని వార్తలు