తలైవికి నష్టం!

2 May, 2020 00:43 IST|Sakshi
కంగనా రనౌత్‌

నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. ఇందులో బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. ఏఎల్‌ విజయ్‌ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శైలేష్‌ ఆర్‌ సింగ్, విష్ణువర్థన్‌ ఇందూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్, చెన్నైలో రెండు భారీ సెట్స్‌ వేశారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితులు జూన్‌ వరకు పొడిగించబడినట్లయితే అది వర్షాకాలం కాబట్టి ఆ సెట్స్‌ పాడైపోతాయని ఆందోళన చెందుతున్నారు చిత్రబృందం.

‘‘హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో మార్చిలో, చెన్నై సెట్‌లో ఏప్రిల్‌లో షూటింగ్‌ జరపాలనుకున్నాం. లాక్‌డౌన్‌ వల్ల కుదరలేదు. ఇంకా దాదాపు నలభైశాతం సినిమా చిత్రీకరించాల్సి ఉంది. లాక్‌డౌన్‌ తొందరగా ముగిసి షూటింగ్‌కు ఓ పది రోజుల సమయం దొరికినా హైదరాబాద్‌ సెట్‌కు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

ఇప్పటికే ఒక్కరోజు షూటింగ్‌ జరపకుండానే హైదరాబాద్‌కు సెట్‌కు సంబంధించి మార్చి నెలకు సరిపడా డబ్బుని సెట్‌ వేసిన స్టూడియోకు చెల్లించిందట చిత్రబృందం. ఒకవేళ ఈ సెట్స్‌లో షూటింగ్‌ జరపడానికి కుదరకపోతే ‘తలైవి’ నిర్మాతలకు దాదాపు 5 కోట్ల నష్టం వాటిల్లుతుందని టాక్‌. మరోవైపు బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగన్‌ నటిస్తున్న ‘మైదాన్‌’ చిత్రం కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. ఫుట్‌బాల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఓ స్టేడియం సెట్‌ వేశారు. వర్షాకాలం వచ్చేలోపు ఆ సెట్‌లో షూటింగ్‌ పూర్తి చేయకపోతే ఇబ్బంది అవుతుందనే ఆందోళనలో ఆ చిత్రబృందం ఉంది.

మరిన్ని వార్తలు