ఐదు రోజులు ఇక్కడ... తర్వాత అమెరికాలో!

24 Jul, 2017 23:25 IST|Sakshi
ఐదు రోజులు ఇక్కడ... తర్వాత అమెరికాలో!

సెట్స్‌పైకి వెళ్లడానికి ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కృష్ణచైతన్య స్క్రిప్టుకు నితిన్‌ క్లాప్‌ కొట్టారు. వీళ్లిద్దరి కలయికలో రూపొందుతోన్న సినిమా చిత్రీకరణ సోమవారం మొదలైంది. నితిన్‌ హీరోగా పాటల రచయిత కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్, శ్రేష్ఠ్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.నిన్నటినుంచి ఈ శుక్రవారం వరకు అంటే... ఐదు రోజులపాటు ఈ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతుందని చిత్రబృందం తెలిపింది.

ఆగస్టులో అమెరికాలో భారీ షెడ్యూల్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నితిన్‌ సరసన ‘లై’లో నటిస్తున్న మేఘా ఆకాశ్‌ ఇందులోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి మూలకథను అందించారు. రావు రమేశ్, నరేశ్, ప్రగతి, లిజీ, నర్రా శ్రీను, శ్రీనివాసరెడ్డి, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్, కెమెరా: నటరాజ్‌ సుబ్రమణ్యమ్‌ (‘అఆ’ ఫేమ్‌), కళ: రాజీవ్‌ నాయర్, కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్, సమర్పణ: నిఖితారెడ్డి, నిర్మాత: సుధాకర్‌రెడ్డి, కథనం–మాటలు–దర్శకత్వం: కృష్ణచైతన్య.