మీ సినిమాలు మాకొద్దు!

26 Apr, 2020 00:13 IST|Sakshi

లాక్‌ డౌన్‌తో థియేటర్స్‌ అన్నీ మూతబడ్డాయి. రిలీజ్‌ కి రెడీ అయిన సినిమాల పరిస్థితి అయోమయంలో పడింది. తాజాగా తమిళంలో ఓ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ కాకముందే ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లో విడుదల కాబోతోంది. జ్యోతిక ముఖ్య పాత్రలో ఫ్రెడ్రిక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొన్‌ మగళ్‌ వందాల్‌’. ఇందులో జ్యోతిక న్యాయవాదిగా కనిపించనున్నారు. ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలనుకున్నారు. అప్పటికే దేశ వ్యాప్త  లాక్‌ డౌన్‌ విధించింది ప్రభుత్వం. తాజాగా ఈ సినిమాను డైరెక్ట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మే మొదటివారంలో ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ కానుందట. ఈ వార్తలకు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ ప్రతికూలంగా స్పందించింది. ‘‘థియేటర్‌ లో రిలీజ్‌ చేయడం కోసం తయారు చేసిన సినిమాలను నేరుగా డిజిటల్‌ లో రిలీజ్‌ చేయడం కరెక్ట్‌ కాదు’’ అని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఆర్‌.  పన్నీర్‌ సెల్వం  పేర్కొన్నారు.  ‘‘అలా చేస్తే ఆ నిర్మాణ సంస్థ (ఈ చిత్రాన్ని జ్యోతిక భర్త, హీరో సూర్య నిర్మించారు) నుంచి వచ్చే తదుపరి సినిమాలను థియేటర్స్‌ లో ప్రదర్శించం. వాళ్ల సినిమాలను డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో రిలీజ్‌ చేసుకోవచ్చు. మా థియేటర్స్‌కి వాళ్ల సినిమాలు అక్కర్లేదు’’ అని పన్నీర్‌ సెల్వం పేర్కొన్నారు.

అక్షయ్‌ సినిమా కూడా?
బాలీవుడ్‌ లో తాజాగా వినిపిస్తున్న టాపిక్‌ ఏంటంటే.. అక్షయ్‌ కొత్త చిత్రం ‘లక్ష్మీ బాంబ్‌’ కూడా థియేటర్‌ లో కాకుండా డిజిటల్‌ గా రిలీజ్‌ కానుందట. రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళ ‘కాంచన’కి రీమేక్‌. జూన్‌లో ఈ సినిమా విడుదల కావాలి. మరి డిజిటల్‌ రిలీజ్‌ వార్తలు ఎంత వరకు నిజమో? తెలియాలి.

మరిన్ని వార్తలు