ముఖ్యంగా ఆ మూడు ఉండాలి

4 Nov, 2017 04:57 IST|Sakshi

తమిళసినిమా: ముఖ్యం గా ఆ మూడు అంశాలు ఉండాలనుకున్నాను అని అన్నారు దర్శకుడు హెచ్‌.వినోద్‌. చతురంగవేట్టై చిత్రం ద్వారా దర్శకుడిగా పరి చయం అయ్యి తొలి చి త్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈయన తాజాగా కార్తీ కథానాయకుడిగా ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రాన్ని తెరకెక్కించారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ అధినేతలు ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌.ప్రభుల తాజా చిత్రం ఇది. నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం, సత్యన్‌ సూర్యన్‌ ఛాయాగ్రహణం  అందించారు.

కాగా ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 17న తమిళం, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. తెలుగులో ఖాకి పేరుతో తెరపైకి రానున్న ఈ చిత్ర వివరాలను తెలియజేయడానికి చిత్ర యూనిట్‌ గురువారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు జిబ్రాన్‌ మాట్లాడుతూ తాను సంగీతాన్ని అందించిన పూర్తి కమర్షియల్‌ కథా చిత్రం అధికారం ఒండ్రు అని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు వినోద్‌ మాట్లాడుతూ ఇది పక్కా కమర్షియల్‌ చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్రంలో ముఖ్యంగా ఎంటర్‌టెయిన్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎంగేజ్‌ మొదలగు మూడు అంశాలు ఉండాలని తాను భావించానని, వాటిని చిత్రంలో సరిగా పొందుపరచాననే అనుకుంటున్నానని అన్నారు.

చాలా నేర్చుకున్నా..
చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ ఈ చిత్రంతో తాను చాలా నేర్చుకున్నానని అన్నారు. ఇంతకు ముందు చిరుతై చిత్రంలో పోలీస్‌ అధికారి పాత్రలో నటించానని, మళ్లీ ఈ చిత్రంలో అలాంటి పాత్ర చేయాల్సి రావడంతో పలువురు పోలీస్‌ అధికారులను కలిసి వారి వద్ద శిక్షణ తీసుకున్నానని తెలిపారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ గ్రామీణ యువతిగా చక్కగా నటించిందని అన్నారు. 

మరిన్ని వార్తలు