‘జగమే మాయ’తో ఈ ఏడాది కచ్చితంగా హిట్ కొడతా’’ అని నమ్మకంగా చెబుతున్నారు నటుడు శివబాలాజి. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ- ‘‘నా పుట్టిన రోజు, దసరా ఒకే రోజు రావడం, ఆ టైమ్లో నేను షూటింగ్లో బిజీగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం ‘జెండాపై కపిరాజు’ సినిమా మేకింగ్లో ఉంది. అలాగే... ‘జగమే మాయ’ ప్రొడక్షన్లోనే మరో సినిమా చేయబోతున్నాను.
ఈ ఏడాది నాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి’’ అని ఆనందం వ్యక్తం చేశారు శివబాలాజి. ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టుంది? అనంటే.. ‘‘నా దగ్గరకొచ్చే స్క్రిప్టులే చాలా తక్కువ. వాటిలో మంచి కథల్ని ఎంచుకోవాలి. గతంలో ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేశాను. దాని వల్ల నష్టపోయాను. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదనే సెలక్టివ్గా సినిమాలు ఒప్పుకుంటున్నాను’’ అని చెప్పారు. 2002లో తాను హీరో అయ్యానని, ఆ టైమ్లో తనతో పాటు 150 మంది కొత్త హీరోలు తెలుగుతెరకు పరిచయమైనా... వారిలో నిలదొక్కుకుంది మాత్రం తాను, అల్లు అర్జున్, విష్ణు మాత్రమేనని శివబాలాజి గుర్తు చేసుకున్నారు.
నటునిగా నిలదొక్కుకోవడమే తన లక్ష్యమని, ఈ క్రమంలో విలన్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. తన భార్య స్వప్నమాధురి గురించి చెబుతూ- ‘‘తను అడుగుపెట్టగానే నా జీవితమే మారిపోయింది. తను లేకపోతే ఉండలేనేమో అనిపిస్తోంది. కెరీర్ విషయంలో తను నాకెన్నో సలహాలిస్తూ ఉంటుంది. నటిగా ప్రస్తుతం స్వప్న కూడా బిజీగా ఉండటం ఆనందంగా ఉంది. తమిళంలో సినిమాలు చేస్తోంది తను’’అన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర అయినా పోషించాలని ఉందన్న ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు శివబాలాజి.