విజయ్ నో అంటే నేనే హీరో అవుతా!

6 Jun, 2016 09:01 IST|Sakshi
విజయ్ నో అంటే నేనే హీరో అవుతా!

ఖుషీ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో విజయ్‌కు, తెలుగులో పవన్‌కల్యాణ్‌కు అంత ఘన విజయాలను అందించిన దర్శకుడు ఎస్‌జే.సూర్య అన్నది తెలిసిందే. ఆ తరువాత ఎస్‌జే.సూర్య హీరోగా అవతారమెత్తి న్యూ,అఆ తదితర చిత్రాల్లో నటించారు. ఆ మధ్య ఇసై అనే చిత్రంలో నటించి దర్శకత్వం వహించారు. ఏదేమైనా హీరోగా అంతగా సక్సెస్‌ను అందుకోలేక పోయిన ఎస్‌జే.సూర్య క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా మళ్లీ మెగాఫోన్ పట్టడానికి సిద్ధమయ్యారు. ఖుషీ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించాలన్న నిర్ణయానికి వచ్చి కథను తయారు చేసుకున్నారు. ఇందులో విజయ్‌ను నటింపజేయడానికి పులి చిత్ర షూటింగ్‌లో ఉన్న ఆయన చుట్టూ తిరిగారు. ఒక దశలో వీరి కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం జరిగింది. అయితే విజయ్ వేరే దర్శకుడికి కాల్‌షీట్స్ ఇచ్చి ఎస్‌జే.సూర్యకు షాక్ ఇచ్చారు. దీంతో ఆయన ఖుషీ-2ను ముందుగా తెలుగు తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.

అందుకు పవన్‌కల్యాణ్ ఓకే చెప్పడంతో అక్కడ ఖుషీ-2 తెర రూపం దాల్చనుంది. ఇందులో శ్రుతిహాసన్ నాయకిగా నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. తెలుగులో నిర్మాణం పూర్తి అయిన తరువాత ఆ చిత్రాన్ని తమిళంలోనూ రీమేక్ చేయాలని ఎస్‌జే.సూర్య నిర్ణయించుకున్నారని సమాచారం.అప్పుడు మరోసారి విజయ్‌ను కాల్‌షీట్స్ అడగనున్నట్లు, అప్పటికీ ఆయన ముఖం చాటేస్తే తానే ఖుషీ-2లో హీరోనవ్వాలని ఎస్‌జే.సూర్య నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.