ఆ ఆలోచన శేష్‌దే

7 Aug, 2018 01:08 IST|Sakshi
శశికిరణ్‌ తిక్క

‘‘శేఖర్‌ కమ్ములగారి దగ్గర ‘లీడర్‌’ సినిమాకు పనిచేశా. నేను, శేష్‌ కలిసి ‘గూఢచారి’ రాయడం వల్ల  యాక్షన్‌ సినిమా చేశాం. శేష్‌ లేకుండా ఉంటే ‘గూఢచారి’ వంటి యాక్షన్‌ సినిమా చేయలేకపోయేవాణ్ని. ఎందుకంటే నాకు గొడవలంటే ఇష్టం ఉండదు’’ అని డైరెక్టర్‌ శశికిరణ్‌ తిక్క అన్నారు. అడివి శేష్, శోభితా ధూళిపాళ జంటగా అభిషేక్‌ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ‘గూఢచారి’ ఈ నెల 3న విడుదలైంది.  దర్శకుడు శశికిరణ్‌ తిక్క మాట్లాడుతూ– ‘‘స్పై సినిమాలు వచ్చి చాలా కాలమైంది. అది కూడా మాకు మంచిదే అయింది.

అప్పట్లో కృష్ణగారు, చిరంజీవిగారు చేసిన స్పై మూవీస్‌ అప్పటి టెక్నాలజీకి తగ్గట్టు అప్‌డేటెడ్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఇప్పటి టెక్నాలజీ ప్రకారం సినిమా చేయాలి. ‘గూఢచారి’ రిజల్ట్‌ గురించి ఆలోచించలేదు. మంచి సినిమా తీయాలనే ఓ మొండి ధైర్యంతో ముందుకెళ్లిపోయా. సినిమా చూసిన వాళ్లు పొగడ్తలతో ముంచెత్తుతారని అనుకోలేదు. చిన్నప్పట్నుంచి ఇంగ్లీష్‌ సినిమాలు చూడటం వల్ల ఆ ప్రభావం ఉంది. సడెన్‌గా ఓ హాలీవుడ్‌ స్క్రిప్ట్‌ ఇచ్చి సినిమా చేయమంటే చేయలేను.

ఎందుకంటే కల్చర్‌ ప్రకారం నేను తెలుగువాణ్ణి. ‘గూఢచారి’ మేకింగ్, స్టైలిష్‌నెస్‌ ఇంగ్లీష్‌ సినిమాలా అనిపించినా, కంటెంట్‌ పరంగా తెలుగు సినిమానే. సుప్రియగారిని ఈ సినిమాలో నటింప చేయాలనే ఆలోచన అడివి శేష్‌దే. తనకు సుప్రియ మంచి ఫ్రెండ్‌. ‘గూఢచారి’ సీక్వెల్‌ చేస్తే బావుంటుందని శేష్‌ కూడా అన్నాడు. తను వేరే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. నేను బయట సినిమా చేసిన తర్వాత ఈ సీక్వెల్‌ గురించి ఇద్దరం ఆలోచిస్తాం. ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు. నా మైండ్‌లో కొన్ని ఐడియాలున్నాయి. ఇంకా పూర్తి స్థాయి కథలు ప్రిపేర్‌ చేయలేదు.

మరిన్ని వార్తలు