సినిమాలే శ్వాసగా... సినిమాలే ఆశగా... 42 ఏళ్లుగా ఓ వ్యక్తి జీవితంలో ముందడుగు వేస్తుండడం అంటే మాటలు కాదు. ఇట్స్ రియల్లీ సమ్థింగ్! నిన్నటి (బుధవారం)కి సరిగ్గా 42 ఏళ్లు... నటుడిగా మంచు మోహన్బాబు తెలుగు తెరపై అడుగుపెట్టి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన నటించిన ‘స్వర్గం నరకం’ 42 ఏళ్ల క్రితం నవంబర్ 22న విడుద లైంది. తర్వాత నటుడిగా, నిర్మాతగా, కథానాయకుడిగా ఆయన అభివృద్ధి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. చిత్రసీమలోకి మోహన్ బాబు అడుగుపెట్టి 42 ఏళ్లు అయిన సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గాయత్రి’ టైటిల్ లోగోను విడుదల చేశారు.
‘పెళ్లైన కొత్తలో’ ఫేమ్ మదన్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై అరియానా– వివియానా–విద్యా నిర్వాణ సమర్పణలో మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ‘మేడ మీద అబ్బాయి’ ఫేమ్ నిఖిలా విమల్ ఆయన కుమార్తెగా నటిస్తున్నారు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే... ఈ రోజు మోహన్బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా విష్ణుకు ‘గాయత్రి’ టీమ్ శుభాకాంక్షలు తెలిపింది. విష్ణు తాజా సిన్మా ‘వోటర్’ ఫస్ట్ లుక్ను నిన్న రాత్రి 10 గంటలకు విడుదల చేశారు.