ఆ సినిమా సీక్వెల్‌లో తొలి సీన్‌ ఇదే!

19 Aug, 2017 18:14 IST|Sakshi

ముంబై :
యాక్షన్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌కుమార్ తాజా సినిమా 'టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ' మంచి టాక్‌తో దూసుకుపోతోంది. 'భార్య ఇంట్లో ఉండాలంటే.. ఇంట్లో టాయ్‌లెట్‌ ఉండాల్సిందే' అన్న సామాజిక అంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా సక్సెస్‌ టాక్‌తో దూసుకుపోవడంతో అప్పడే రెండో పార్ట్‌పై అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ కన్నా ఓ ఆసక్తికర కామెంట్‌ చేసింది. దీనికి రెండో పార్ట్‌లో తొలి సీన్‌ ఇదే అయ్యి ఉంటుందని బీచ్‌ పక్కనే బహిర్భూమి వెళ్తున్న ఓ వ్యక్తి ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

మార్నింగ్‌ వాక్‌ వెళ్లినప్పడు తాను తీసిన ఈ ఫోటోను పోస్ట్‌ చేసిన కొద్ది వ్యవధిలోనే వైరల్‌ అయింది. సినిమా ప్రమోషన్‌ కోసం మరీ ఇలాంటి ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టాలా అంటూ కొందరూ విమర్శిస్తుంటే, కనీసం ఈ సినిమా చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ టాయిలెట్‌లు నిర్మించుకోవాలని ట్వింకిల్‌ కన్నాకు బాసటగా నిలుస్తూ.. నెటిజన్లు కామెంట్‌లు చేశారు. అందరికీ టాయిలెట్లు అందుబాటులో ఉండవు కదా..అని ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌కు ట్వింకిల్‌ కన్నా బదులిచ్చారు.. సరిగ్గా అక్కడి నుంచి 7 నుంచి 8 నిమిషాలు నడిస్తే ఓ పబ్లిక్‌ టాయిలెట్‌ ఉందని తెలిపారు.


ఈ ఏడాది బాలీవుడ్‌కు అంతగా కలిసిరాలేదు. సూపర్‌స్టార్లు సల్మాన్‌ఖాన్‌ 'ట్యూబ్‌లైట్‌', షారుఖ్‌ ఖాన్‌ 'జబ్‌ హ్యారీ మెట్‌ సెజెల్‌' చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. కనీసం యావరేజ్‌ కలెక్షన్లు కూడా రాబట్టలేక.. డిజాస్టర్లుగా మిగిలాయి. 'బాహుబలి-2' తర్వాత బాలీవుడ్‌ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్‌ కావడం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల నడుమ వచ్చిన యాక్షన్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌కుమార్ తాజా సినిమా 'టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ' బాలీవుడ్‌ ఆశలను నిలబెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానస పథకమైన 'స్వచ్ఛభారత్‌' మద్దతుగా కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్‌ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరినిచ్చింది. ఆగస్టు 11న (గత శుక్రవరం) విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 96 కోట్లు కలెక్ట్‌ చేసింది. మొత్తానికి ఎయిర్‌లిప్ట్‌, రుస్తుం, హౌస్‌ఫుల్‌-3, జాలీ ఎల్‌ఎల్‌బీ-2 చిత్రాలతో వరుసగా వందకోట్ల క్లబ్బును అందుకున్న ఈ సూపర్ స్టార్‌ మరోసారి సూపర్‌ హిట్‌ను అందుకొని తన స్టామినా ఏంటో చాటాడు. ‘స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌’ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఆధారంగా తీసిన ఈ చిత్రానికి శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో భూమి పడ్నేకర్, అనుపమ్‌ ఖేర్, సనాఖాన్‌ తదితరులు నటించారు.