నటుడు సునీల్‌కు అస్వస్థత.. బాగానే ఉన్నా

23 Jan, 2020 12:00 IST|Sakshi

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌  అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్‌ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఈ వార్తలపై స్పందించిన సునీల్‌... తాను ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. సైనస్‌, ఇన్ఫెక్షన్‌ కారణంగా వైద్యుల సూచనతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. కాగా... సునీల్‌ తాజాగా నటించిన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

ఇక హాస్య నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సునీల్.. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ సినిమాతో హిట్టు కొట్టారు. తొలుత హీరోగా మంచి విజయాల్ని అందుకున్న సునీల్‌.. తరువాత ఆశించిన ఫలితాలు పొందలేకపోయారు. దీంతో పంథా మార్చుకుని.. మళ్లీ హాస్య నటుడిగా అవతారమెత్తారు. కాగా హీరోగా, కమెడియన్‌గా ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ప్రతినాయకుడిగా కనిపించేందుకు సిద్ధమయ్యారు. 'కలర్ ఫోటో' అనే సినిమాలో సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని వార్తలు