ఏపీ సీఎంతో సినీ పెద్దల భేటీ.. బాలయ్యకు ఆహ్వానం

6 Jun, 2020 11:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఈ నెల 9న సినీ పెద్దలు సమావేశం కానున్నట్లు నిర్మాత సి. కళ్యాణ్‌ తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చర్చించేందుకు ఈ నెల 9న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌తో భేటీ కానున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశానికి మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణతో సహా టాలీవుడ్‌కు చెందిన అందరినీ ఆహ్వానించామన్నారు. అయితే జూన్‌ 10న బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలు ఉండటంతో ఆయన ఈ సమావేశానికి రావటం లేదన్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు చెబుతామని సి. కళ్యాణ్‌ పేర్కొన్నారు. (‘ఇంట్లో పెళ్లి కాదు.. బొట్టు పెట్టి పిలవడానికి’)

ఇక ఇదే సమావేశంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లకు అనుమతితో పాటు థియేటర్ల ఓపెన్‌, తదితర అంశాల గురించి కూడా సీఎం జగన్‌తో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇవే అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సినీ పెద్దలు సమావేశం అయిన విషయం తెలిసిందే. అంతకుముందు చిరంజీవి నివాసంలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కూడా సినిమా షూటింగ్‌ల అనుమతిపై చర్చించారు. అయితే ఈ సమావేశాలకు తనను ఆహ్వానించలేదని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పలు వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. దీంతో ఈ సారి ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా అందరినీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. (బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు..)

మరిన్ని వార్తలు