సినీ కార్మికుల నిరసన

25 Jun, 2020 12:30 IST|Sakshi
తెలుగు లైట్‌మెన్‌ యూనియన్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న సభ్యులు

జూబ్లీహిల్స్‌:  లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన సీసీసీ కార్యక్రమంలో భాగంగా అందిస్తున్న నిత్యావసరాలు కొందరికే పంపిణీ చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని నిరసిస్తూ కార్మికులు ఇందిరానగర్‌ ప్రాంతంలోని కార్యాలయాల వద్ద బుధవారం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. సీసీసీ ఆధ్యర్యంలో  మొదటి విడతగా కార్మికులకు నేరుగా సరుకులు అందించగా రెండో విడత కార్మిక యూనియన్ల ద్వారా అందించాలని నిర్ణయించారు.

తరువాత మాటమార్చిన సీసీసీ అందరికి ఇవ్వలేమని, కొందరు సభ్యులకు మాత్రమే ఇస్తామని పేర్కొంది. దీంతో  సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.  కేవలం సగం మందికే సరుకులు ఇస్తామని చెప్పడంతో యూనియన్‌ నాయకులకు కూడా ఏమిచేయాలో అర్థం కాలేదు. విషయం తెలుసుకున్న  తెలుగు సినీటీవీ ప్రొడక్షన్‌ అసిస్టెంట్స్‌ యూనియన్, తెలుగు లైట్‌మెన్‌ యూనియన్, తెలుగు సినీ స్టూడియోవర్కర్స్‌ యూనియన్లకు చెందిన సభ్యులు బుధవారం కార్యాలయాలను ముట్టడించి ఆందోళనకు దిగారు. మూడునెలలుగా షూటింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సమస్యను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని  హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు. 

మరిన్ని వార్తలు