ఎన్టీఆర్‌ 15, విజయ్‌ దేవరకొండ 5

15 Oct, 2018 12:40 IST|Sakshi

తిత్లీ తుపాను బాధితులకు హీరోల ఆపన్నహస్తం

సాక్షి, హైదరాబాద్‌: తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు సినీ కథానాయకులు ముందుకు వచ్చారు. తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర వాసులకు ఆపన్న హస్తం అందించేందుకు తమ వంతు సహాయం అందిస్తున్నారు. వరద బీభత్సానికి కకావికలమైన కేరళ రాష్ట్రానికి దన్నుగా నిలిచిన తెలుగు చిత్ర ప్రముఖులు ఇప్పుడు తిత్లీ తుపాను బాధితులకు అండగా ఉండేందుకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ రూ. 15 లక్షలు, నందమూరి కళ్యాణ్‌రామ్‌ రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు.

‘అర్జున్‌రెడ్డి’ రూ.5 లక్షలు
అలాగే యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ తన వంతుగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షలు పంపారు. తుపాను బాధితులకు అండగా నిలవాలని ఆయన ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి లక్ష రూపాయలు ఇచ్చినట్టు తెలిపారు. తన వంతు సాయం చేస్తానని హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ చెప్పారు. తిత్లీ తుపాను కారణంగా సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు విరాళాలు ఇచ్చి సహకరించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

సంపూ.. శభాష్‌!
టాలీవుడ్‌లో అందరికంటే ముందుగా ‘బర్నింగ్‌ స్టార్‌’ సంపూర్ణేశ్‌బాబు స్పందించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.50 వేలు విరాళమిచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. హుద్‌ హుద్‌ తుపాను సమయంలో కూడా లక్ష రూపాయలు సహాయంగా అందించారు. ఆపన్నులకు అండగా నిలవడంలో అందరికంటే ముందుండే ‘సంపూ’పై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

తిత్లీ తుపాను బాధితులకు సహాయం చేయాలనుకునే వారు తమ విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించొచ్చు
అకౌంట్‌ పేరు: సీఎం రిలీఫ్‌ ఫండ్‌
అకౌంట్‌ నంబరు: 110310100029039
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ANDB0003079
బ్యాంకు, బ్రాంచ్‌: ఆంధ్రా బ్యాంకు, ఏపీ సచివాలయం బ్రాంచ్‌, వెలగపూడి

మరిన్ని వార్తలు