టాలీవుడ్‌ రహస్య భేటీ.. హాజరైన అగ్రహీరోలు!

24 Apr, 2018 20:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల పలు దుమారాలు టాలీవుడ్‌ను కుదిపేస్తున్న నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అగ్ర హీరోలు మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో మంగళవారం రాత్రి ఏడు గంటల నుంచి ఈ భేటీ జరుగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర హీరోలు చిరంజీవి, రాంచరణ్, మహేశ్‌బాబు, అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, నాగచైతన్య, సుమంత్‌, నాగబాబు, నాని తదితర దాదాపు 20 మంది హీరోలు, సినీ ముఖ్యులు ఈ భేటీలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.

టాలీవుడ్‌ను క్యాస్టింగ్‌ కౌచ్‌ దుమారం కుదిపేస్తుండటం, టాలీవుడ్‌లో మహిళలను లైంగికంగా దోచుకుంటున్నారని నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేయడం, పవన్‌ కల్యాణ్‌పై ఆమె చేసిన దూషణలు, ఈ వ్యవహారం వెనక తాను ఉన్నట్టు రాంగోపాల్‌ వర్మ ఒప్పుకోవడం, మీడియాలో కథనాల నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. ఇది రహస్య సమావేశమేనని సంబంధిత వర్గాలు అంటున్నాయి. గత కొన్నిరోజులుగా తాజా వివాదాలపై పలు విభాగాల ముఖ్యులు సమావేశమవుతూ వస్తున్నారు. తాజాగా హీరోల భేటీకి మీడియాకు అనుమతి ఇవ్వలేదు. గోప్యంగా జరుగుతున్న ఈ భేటీలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవలి వివాదాలు, రాంగోపాల్‌ వర్మ, మీడియా తీరుపై తదితరాలు చర్చకు వచ్చే అవకాశముందని అంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగిందని అంటున్నారు. 

మరిన్ని వార్తలు