దిల్‌ వాకిట్లో తేజస్విని

12 May, 2020 00:10 IST|Sakshi
కుటుంబ సభ్యులతో ‘దిల్‌’ రాజు దంపతులు

ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు (వెంకట రమణారెడ్డి) వివాహం హైదరాబాద్‌కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)తో ఆదివారం రాత్రి జరిగింది. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా జరిగిన ఈ వివాహ వేడుకలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 7.23 గంటలకు పెళ్లి జరిగింది. నూతన దంపతులిద్దరూ సోమవారం ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేశారు.
కాగా ‘దిల్‌’ రాజు భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. తన కుమార్తె హన్షితా రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు ఆరు నెలల క్రితమే ‘దిల్‌’రాజుకు తేజస్వినితో వివాహ ముహూర్తాన్ని నిశ్చయించినట్లు సమాచారం. ‘‘జీవితంలో ఈ కొత్త ప్రారంభం అద్భుతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను నాన్నా. మీ ఇద్దరూ ప్రేమతో, సంతోషంగా ఉండాలి’’ అని ‘దిల్‌’  రాజు కుమార్తె హన్షితా రెడ్డి సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. అన్నట్లు ‘దిల్‌’ రాజు నిర్మించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఒకటి. ఇప్పుడు పెళ్లి జరిగిన సందర్భంగా ఆయన జీవితానికి ఈ టైటిల్‌ ని ఆపాదించి ‘దిల్‌ వాకిట్లో తేజస్విని’ అనొచ్చు.

 

మరిన్ని వార్తలు