ఓటీటీ హోటల్‌ ఫుడ్‌లాంటిది

7 Jul, 2020 01:51 IST|Sakshi
ఎస్‌కేఎన్‌

‘‘ఎన్ని టెక్నాలజీలు వచ్చినా చిత్రపరిశ్రమకు ఏమీ కాదు. థియేటర్స్‌ మూసి ఉన్నాయి కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ప్రేక్షకులు ఓటీటీవైపు మొగ్గు చూపుతున్నారు. కరోనా పరిస్థితులు పోయి మామూలు స్థితి రాగానే జనం థియేటర్స్‌కి వస్తారు. థియేటర్‌ అంటే ఒక ఎమోషన్‌. ఎన్ని మాధ్యమాలు వచ్చినా థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వలేవు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు హోటల్‌ ఫుడ్‌లాంటివి.

థియేటర్‌లో సినిమా అమ్మ చేతివంట, భార్య చేతివంట లాంటిది’’ అన్నారు ఎస్‌కేఎన్‌. విజయ్‌ దేవరకొండ హీరోగా నిర్మించిన ‘టాక్సీవాలా’తో సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ఎస్‌కేఎన్‌. నేడు ఆయన పుట్టినరోజు.  ఈ సందర్భంగా ఎస్‌కేఎన్‌ విలేకరులతో మాట్లాడుతూ – ‘‘టాక్సీవాలా’ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ‘బన్నీ’ వాస్‌ నిర్మాతగా వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించటం ఎంతో ఆనందాన్నిచ్చింది.

ఆదే ఉత్సాహంతో మారుతి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాను. ఆ సినిమాలో ఓ పెద్ద హీరో నటిస్తున్నారు. మారుతి పర్యవేక్షణలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నాను. ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా, డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అల్లు శిరీష్‌ హీరోగా రాబోతున్న సినిమాకి కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు