బాగా బిజీ.. అతిథి పాత్రలే చేస్తా

4 Jan, 2016 11:19 IST|Sakshi
బాగా బిజీ.. అతిథి పాత్రలే చేస్తా
చెన్నై: నటనకు పూర్తి సమయాన్ని కేటాయించేంత తీరిక తనకు లేదని అలనాటి అందాల హీరోయిన్ అమల అక్కినేని అన్నారు.  తనకు ఇప్పటికే చాలా బాధ్యతలు ఉన్నాయని, వాటిని సమర్ధవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత్రిగా, హైదరాబాద్ బ్లూ క్రాస్ సహ-స్థాపకురాలిగా తన నెత్తిమీద చాలా బాధ్యతలున్నాయి. ఈ బాధ్యతలతో తాను చాలా సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. అప్పుడప్పుడు కొన్నిచిత్రాల్లో గెస్ట్ రోల్స్ మాత్రం చేస్తున్న తాను.. ఇకముందు కూడా అదే కంటిన్యూ చేస్తానని వెల్లడించారు.
  
షూటింగ్ పేరుతో కుటుంబాన్ని, బాధ్యతలను వదిలి తిరగడం కూడా తనకు సాధ్యం కాదన్నారు. అందుకే అతిథి పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. కథ, పాత్ర నచ్చితే అతిథి పాత్రల్లో నటించేందుకు తనకు అభ్యంతరం లేదని తెలిపారు. అలా సినీ పరిశ్రమ, మీడియాతో టచ్‌లో ఉంటూ తనను తాను ఎడ్యుకేట్  చేసుకుంటానని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమను, మీడియాను ఈ రెంటినీ వదిలే  ఉద్దేశం లేదన్నారు. 
 
ప్రముఖ దర్శకులు  నటించమని  తనను అడుగుతూ ఉంటారని.. ఇది తనకు చాలా సంతోషాన్నిస్తుందన్నారు. అలా కమల్ సార్ తనకు కాల్ చేసి మలయాళం డైరెక్టర్ టి.రె. రాజీవ్ కుమార్ ద్వారా వినిపించిన కథ తన మనసుకు బాగా హత్తుకుందన్నారు. ఈ  ప్రాజెక్ట్ పది రోజుల షూటింగ్ నిమిత్తం ఫిబ్రవరిలో అమెరికా వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అమల.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో మెరిసింది. తర్వాత అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం'లో ఓ సీన్లో కనిపించారు. మహేష్ భట్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ ‘హమారీ అధూరీ కహానీ' చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తాజాగా కమల్ హీరోగా తెరకెక్కబోతున్న 'అమ్మా నాన్న ఆట' సినిమాలో అమల అతిథి పాత్ర పోషిస్తున్నారు. రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వంలో  వస్తున్న ఈ  సినిమాలో జరీనా వహబ్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.