ఐ యాం సారీ!

22 Sep, 2016 01:52 IST|Sakshi
ఐ యాం సారీ!

క్షమాపణ కోరడానికి చాలా పెద్ద కారణం కావాలి. నటి త్రిష తన అభిమానులను ఇలాంటి క్షమాపణే కోరారు. అయితే తను అంత పెద్ద తప్పు ఏం చేశారన్నదే ఆసక్తికరమైన అంశం. ఇంతకుముందు చక్కగా పుత్తడిబొమ్మలా ప్రేమకథా చిత్రాల్లో నటించి కమర్శియల్ చిత్రాల నాయకిగా ఎదుగుతూ వచ్చిన త్రిష ఆ మధ్య ప్రేమ,పెళ్లి అంటూ కాస్త హడావుడి చేసినా ప్రస్తుతం ఆ రెండింటికీ దూరంగా నటనపైనే దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు నటిగా త్రిష తన బాణీని మార్చేశారు.ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రాధాన్యత నిస్తున్నారు.అలా నటించిన తొలి చిత్రం నాయకి. తాజాగా మోహిని అనే చిత్రంలో నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ రెండూ హారర్ కథా చిత్రాలే అన్నది గమనార్హం.
 
  ద్విభాషా చిత్రంగా తరపైకి వచ్చిన నాయకి చిత్రం ముందు తెలుగులో విడుదలై ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చింది. ఇక ఇటీవలే తమిళంలోనూ తెరపైకి వచ్చి అదే రిజల్ట్‌ను చవి చూసింది.ఇందుకు నటి త్రిష కూడా ఒక కారణం అనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వస్తోంది.నాయకి చిత్రం ఎలాంటి ప్రచారం లేకుండా విడుదలైందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నటి త్రిష కూడా నాయకి చిత్రానికి ఎలాంటి ప్రచారం చేయలేదని ఆమె అభిమానులే ప్రశ్నిస్తున్నారు. దీనికి స్పందించిన త్రిష తన అభిమానులను క్షమించండి అని కోరుకున్నారు.
 
  కారణం లేనిదే ఏ విషయం జరగదు. అందుకే నాయకి చిత్ర ప్రచార కార్యక్రమాలకు పూనుకోలేదు. ఆ వివరాలన్నీ తరువాత వెల్లడిస్తాను అని త్రిష తన ట్విట్టర్‌లో పేర్కొనడం చర్చనీయంశంగా మారింది. త్రిషకు ఆ చిత్ర నిర్మాత పారితోషికం పూర్తిగా చెల్లించలేదని, దాని గురించి అడిగిన్నప్పుడు తమిళ వెర్షన్ విడుదలైనప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఇస్తానని ఆ నిర్మాత చెప్పినట్లు మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. త్రిష నాయకి చిత్రం గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడానికి ఇదే కారణమా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఇక అసలు కారణాలు ఏమిటన్నది ఈ చెన్నై చిన్నది నోరు విప్పితే కానీ తెలియదు.
 

>