సరైనోడు తారసపడితే..

17 Mar, 2019 10:28 IST|Sakshi

సరైనోడు తారసపడితే అంటోం ది నటి త్రిష. నటిగా 15 ఏళ్ల అనుభవాన్ని గడించిందీ బ్యూటీ. అంటే మరో అందాల నటి అనుష్క కంటే ఒక ఏడాది సీనియరే. సహాయ నటిగా రంగప్రవేశం చేసిన ఈ చెన్నై చిన్నది అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ హీరోయిన్ల సరసన చేరింది.  స్టార్‌ హీరోలందరితోనూ నటించింది. నటుడు శింబు, ఆర్య వంటి నటులు చాలా లైక్‌ చేసే నటి త్రిష. టాలీవుడ్‌ నటుడు రానాతో ప్రేమాయణం అనే ప్రచారం కాస్తా ఎక్కువగానే సాగింది.

వీరిద్దరిని కలిపి పెళ్లి చేస్తానని నటుడు ప్రభాస్‌ ఈ మధ్య ఒక రియాలిటీ షోలో బహిరంగంగానే రానా సమక్షంలో అన్నాడు. మరి ఆ ప్రయత్నం ఎంత వరకూ వచ్చిందో తెలియదు. కాగా నటిగా దక్షిణాదిలో రాణించిన త్రిష అదే జోరును ఉత్తరాదిలోనూ కొనసాగించాలని ఆశించినా అది సాధ్యం కాలేదు. ఒక్క చిత్రంతోనే అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. ఇక ప్రస్తుతం తమిళంలోనే ఈ అమ్మడికి ఆశాజనకంగా ఉంది.

ప్రేమ వ్యవహారంలోనూ చాలా వదంతులను ఎదుర్కొన్న త్రిషకు ఒక తరుణంలో పెళ్లి పీటల దరిదాపులకు వెళ్లే పరిస్థితి వచ్చినా, అది నిశ్చితార్థంతోనే ఆగిపోయింది. అవును.. నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో త్రిష ప్రేమ పెళ్లికి నిశ్చితార్థం వరకూ వచ్చి ఆగిపోయిన విషయం ఆ మధ్య చర్చనీయాంశమైంది. దీంతో ఆ సమయం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందిలే అని సరిపెట్టుకుంది.

అయితే పెళ్లి తంతుపై తనకు నమ్మకం ఉందని మాత్రం త్రిష చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పటికీ అదే అంటోంది. దీని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉందని, కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే ప్రస్తుతానికి తానెవరినీ ప్రేమించడం లేదని, అదేవిధంగా సరైనోడు ఇంకా తారసపడలేదని చెప్పింది. అలాంటోడు కలిస్తే రేపే పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అని అంది. అదేవిధంగా తాను పెళ్లి చేసుకునే ముందు ఆ సమాచారాన్ని అందరికీ చెబుతానని త్రిష పేర్కొంది.

మరిన్ని వార్తలు