మలయాళ చిత్ర రీమేక్‌లో త్రిష

14 Oct, 2016 02:32 IST|Sakshi
మలయాళ చిత్ర రీమేక్‌లో త్రిష

మలయాళ చిత్ర రీమేక్‌లో నటించే లక్కీచాన్స్ సంచల నటి త్రిషను వరించిందన్నది తాజా సమాచారం. ఇంతకు ముందు కమర్శియల్ కథా చిత్రాలను చేసిన ఈ చెన్నై చిన్నది ఇటీవల లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనే వరుసగా చేస్తున్నారు. నాయకి చిత్రం తరువాత ప్రస్తుతం మోహిని చిత్రం చేస్తున్నారు. విదేశాల్లో చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ హారర్ కథా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మరో చిత్రానికి త్రిష పచ్చజెండా ఊపారు. రెండేళ్ల క్రితం విడుదలై మంచి విజయాన్ని సాధించిన మలయాళ చిత్రం 100 డిగ్రీ సెల్సియస్‌ను తమిళంలోకి రీమేక్ చేయనున్నారు.
 
అక్కడ రోషన్ గొప్పన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందించారు. నటి శ్వేతామీనన్, భామ, మేఘ్నారాజ్, అనన్య, హరిత ఐదుగురు నటీమణులు నటించిన ఈ మహిళా ఇతివృత్తంతో కూడిన కథా చిత్రాన్ని రీమేక్ దర్శక కింగ్‌గా పేరు పొందిన మిత్రన్ జవహర్ తమిళంలో దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు తెలుగులో హిట్ అయిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, రెడీ చిత్రాలను యారడీ నీ మోహినీ, ఉత్తమ పుత్రన్ పేర్లతో తమిళంలో దర్శకత్వం వహించారు.
 
అదే విధంగా ఇటీవల మలయాళ చిత్రం తల్లయన్ మరయత్తు చిత్రాన్ని తమిళంలో మీండుం ఒరు కాదల్ కథై పేరుతో దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. తాజాగా 100 డిగ్రీ సెల్సియస్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో ప్రస్తుతానికి త్రిష, రాయ్‌లక్ష్మీ నాయకిలుగా ఎంపికయ్యారని సమాచారం. ఇతర నటీమణుల ఎంపిక పూర్తి కాగానే షూటింగ్‌కు సిద్ధం కానున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.