త్రిష పెళ్లి ఫిక్స్‌ అయ్యిందా..? 

23 Jul, 2020 08:13 IST|Sakshi

నటి త్రిష పెళ్లి ఫిక్స్‌ అయిందా? కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ఇదే. అందుకు కారణం ఈమె పెళ్లి చేసుకోబోతున్నారని ఓ చానల్‌లో ప్రచారం జరగడమే. నటుడు శింబు, త్రిషల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉంది. ఈ విషయాన్ని వాళ్లు చాలాసార్లు బహిరంగంగానే వెల్లడించారు. ఆమె ప్రేమ పెళ్లి గురించి చాలా ప్రచారం జరిగింది. దక్షిణాది భాషలన్నింటిలోనూ కథానాయకిగా నటించిన త్రిష బాలివుడ్‌లోనూ ఒక చిత్రం చేసింది. అయితే ఆ చిత్రం నిరాశపరచడంతో త్రిష ఇక అటువైపు కన్నెత్తి చూడలేదు. అదే విధంగా దక్షిణాదిలోనూ ఆ మధ్య కొన్ని చిత్రాల వరుస ప్లాపులతో కాస్త వెనకబడిపోయింది. అలాంటి 96, పేట చిత్రాల విజయం త్రిషకు మళ్లీ క్రేజ్‌ తెచ్చిపెట్టాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు పూర్తిగా తమిళ చిత్రాలపైనే దృష్టి సారిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన నటించే అవకాశాన్ని తనే వదలుకున్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. త్రిషకు టాలీవుడ్‌ నటుడు రానా మధ్య ప్రేమ వ్యవహారం సాగిందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అభిమానులు త్రిషను సామాజిక మాధ్యమాల్లో రకరకాలుగా ప్రశ్నించడంతో బదులు చెప్పలేక ఇటీవల తన ట్విట్టర్‌ నుంచి వైదొలగారు. ఇటీవల ఆమె ట్విట్టర్‌ అకౌంట్‌ ప్రారంభించారు. ఇకపోతే చాలా కాలం క్రితం త్రిష ఒక సినీ నిర్మాత, వ్యాపారవేత్తతో నిశ్చతార్థం చేసుకున్నారని సమాచారం.

తాజాగా నటుడు శింబు, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం సామాజిక మాద్యమాల్లో జోరుగా సాగుతోంది. దీని గురించి శింబు, త్రిష స్పందించలేదు. శింబు, త్రిష పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ విన్నైతాండి వరువాయా చిత్రంలో నటించారు. అదే చిత్రం తెలుగు రీమేక్‌ ఏ మాయచేసావే చిత్రంలో నటుడు నాగచైతన్య, సమంత కలసి నటించారు. ఈ చిత్ర షూటింగ్‌ సమయంలో ఏర్పడిన ప్రేమ పెళ్లికి దారి తీసిన విషయం తెలిసిందే. అదే విధంగా శింబు త్రిష పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్న లాజిక్‌ను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు