సామి 2 నుంచి త్రిష ఔట్‌

24 Oct, 2017 10:49 IST|Sakshi

సామి2 చిత్ర యూనిట్‌ ఆదిలోనే షాక్‌కు గురైంది. నటుడు విక్రమ్‌కు కమర్షియల్‌ హీరో ఇమేజ్‌ను ఆపాధించిన చిత్రం సామి. యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన హరి దర్శకత్వం వహించిన ఈ చిత్ర విజయంలో కథానాయకి త్రిషకు భాగం ఉంటుంది. ఆమె అందాలు సామి చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. ఇక విషయానికి వస్తే సామి చిత్రానికి సీక్వెల్‌ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.

విక్రమ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హరినే దర్శకుడు. హీరోయిన్ కూడా త్రిషనే. అయితే అధనంగా కీర్తీసురేశ్‌ వచ్చి చేరింది. శిబుతవీన్ భారీ ఎత్తున్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీత బాణీలు కడుతున్నారు. చిత్ర యూనిట్‌ ఇటీవలే ఢిల్లీలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుని తొలి షెడ్యూల్‌ పూర్తి చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో సామి 2 చిత్రం నుంచి వైదొలగుతున్నట్లు నటి త్రిష సోమవారం తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బేధాభిప్రాయం కారణంగా తాను చిత్రం నుంచి తప్పుకున్నానని, చిత్ర యూనిట్‌కు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ అంటూ త్రిష పేర్కొన్నారు. కాగా ఆది నుంచి సామి 2 చిత్రంలో నటి కీర్తీసురేశ్‌కే ప్రాముఖ్యత అని, త్రిష పాత్ర పరిమితంగానే ఉంటుందనే ప్రచారం సాగుతోంది.

తాజా పరిణామాలతో అది నిజమని రుజువయ్యిందనిపిస్తోంది. కాగా త్రిష సామి2 చిత్రం నుంచి వైదొలగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై చిత్ర వర్గాలు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. మొత్తం మీద ఈ విధంగా త్రిష సామి2 చిత్ర యూనిట్‌కు షాక్‌ ఇచ్చారన్నమాట.

మరిన్ని వార్తలు