రాణీ త్రిష

7 Sep, 2019 04:11 IST|Sakshi
త్రిష

చోళుల కాలానికి వెళ్లేందుకు హీరోయిన్‌ త్రిష ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ప్రముఖ నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్‌ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించే వారి జాబితా గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా హీరోయిన్‌ త్రిష ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారని చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాల సమాచారం.

త్రిష చేయబోయేది ఓ రాణి పాత్ర అట. ఇప్పటివరకు ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్‌ మాత్రమే ఫైనలైజ్‌ అయిన సంగతి తెలిసిందే. మోహన్‌బాబు, అనుష్క, ‘జయం’ రవి, కీర్తీ సురేశ్, అమలాపాల్, రాశీఖన్నా... ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో పన్నెండు పాటలు ఉండబోతున్నాయని తెలిసింది. రచయిత వైరముత్తు ఈ చిత్రంలోని పాటలన్నింటినీ రాయబోతున్నారట. అందుకోసం ఆయన పదవ శతాబ్దానికి చెందిన సాహిత్యంపై ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తున్నారని టాక్‌. ఈ సినిమా చిత్రీకరణ డిసెంబరులో ప్రారంభం కానుందట.

మరిన్ని వార్తలు