సాక్షి, చెన్నై: యునిసెఫ్ సంస్థ బాలల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిష సోమవారం నియమితులయ్యారు. కేరళ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘమైన యునిసెఫ్ సంస్థ సంయుక్తంగా చిన్నారులకు మీజిల్స్ టీకా ఆవశ్యకతపై యాడ్ ఫిల్మ్ రూపొందించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్ తరఫున తమిళనాడు, కేరళ చిన్నారుల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిషను నియమించింది.
దీని ద్వారా ఆమె బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక హింస వంటి వాటిపై వ్యతిరేకంగా పోరాడనున్నారు. బాలల విద్య కోసం కృషి చేయనున్నారు. ఈ మేరకు జరిగిన చెన్నైలో జరిగిన నియామక కార్యక్రమంలో త్రిష మాట్లాడుతూ ఇది తనకు లభించిన గౌరవమని, చిన్నారుల హక్కుల కోసం గళం విప్పుతానని ప్రకటించారు. బాలికలు 18 ఏళ్ల వరకు విద్యనభ్యసించితే బాల్య వివాహ వ్యవస్థను రూపుమాపవచ్చని తెలిపారు.