ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

18 Aug, 2019 08:09 IST|Sakshi

కమర్షియల్ చిత్రాల హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న త్రిష ఇప్పుడు హీరోయిన్‌ సెంట్రిక్‌ చిత్రాల మీద దృష్టి పెట్టింది. నటి నయనతార మాదిరిగా హర్రర్‌ కథా చిత్రాన్ని ఎంచుకుంది. అలా తెరకెక్కిన చిత్రమే నాయకి. అయితే ఆ చిత్రం త్రిషను పూర్తిగా నిరాశ పరిచింది. అయినా మోహిని చిత్రంతో మరో ప్రయత్నం చేసింది. అదీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు.

ప్రస్తుతం ఆ తరహా చిత్రాలే మరో మూడు త్రిష చేతిలో ఉన్నాయి. వాటిలో  పరమపదం విళైయాట్టు, గర్జన చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతున్నాయి. తాజాగా రాంగీ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. కారణం దీనికి కథ, మాటలను ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ అందించడమే. ఆయన శిష్యుడు శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న రాంగీ చిత్రాన్ని  లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఇది పూర్తి యాక్షన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రంగా ఉంటుందట. ఫైట్స్‌ సన్నివేశాల్లో త్రిష డూప్‌ లేకుండా నటించేస్తోందట. ఇప్పటికే అధిక భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న రాంగీ చిత్రం ప్రస్తుతం చెన్నైలో షూటింగ్‌ జరుపుకుంటోంది. కాగా వచ్చే నెలలో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను ఉజ్బేకిస్తాన్‌లో చిత్రీకరించనున్నారని తెలిసింది. అందు కోసం త్వరలో చిత్ర యూనిట్‌ ఉజ్బేకిస్తాన్‌కు పయనం అవుతోందట.

రాంగీ చిత్రాన్ని సెప్టెంబరు చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రాల నాయకిగా ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలు త్రిషను నిరాశ పరిచాయి. ఇక గర్జన, పరమపద విళైయాట్టు చిత్రాలు విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో రాంగీ చిత్రాన్ని సెప్టెంబరు నెలలో తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరగుతుండటంతో త్రిష ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. దీని కోసం చాలా కసరత్తులు చేసి తనను మార్చుకుంది కూడా. చూద్దాం ఈ సారైన హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ చిత్రాల నాయకిగా ఈ బ్యూటీ సక్సెస్‌ను అందుకుంటుందేమో.

మరిన్ని వార్తలు