కరోనాపై పోరాటానికి త్రివిక్రమ్‌, అనిల్‌ రావిపూడి విరాళం

26 Mar, 2020 11:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై పోరాటానికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కరోనాపై పోరాటానికి రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్టు త్రివిక్రమ్‌ తెలిపారు. త్వరలోనే ఈ మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేయనున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, గతంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా త్రివిక్రమ్‌ తన వంతు బాధ్యతగా స్పందించిన సంగతి తెలిసిందే. 

రూ. 10 లక్షల విరాళం ప్రకటించిన అనిల్‌ రావిపూడి
మరో దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా కరోనా పోరాటంలో భాగంగా తెలుగు రాష్ట్రాలు చేపట్టిన సహాయక చర్యలకు రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఆంధ్ర్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 5 లక్షల చొప్పున విరాళం అందజేయనున్నట్టు తెలిపారు. లాక్‌డౌన్‌ విజయవంతం చేయడానికి ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

చదవండి : క‌రోనా.. తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం

కరోనా బాధితులకు పవన్ కల్యాణ్‌ విరాళం

మరిన్ని వార్తలు