మా బుట్టబొమ్మ..లా వాటే బ్యూటీ ఉంది

19 Feb, 2020 04:21 IST|Sakshi
∙వెంకీ కుడుముల, త్రివిక్రమ్, రష్మికా మందన్నా, నితిన్, సూర్యదేవర నాగవంశీ, మహతి సాగర్‌ 

‘‘భీష్మ’ సినిమాని చూశాను.. చాలా చాలా బాగుంది. 21న అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తారని నమ్మకంగా చెబుతున్నా’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్‌. నితిన్, రష్మికా మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథి త్రివిక్రమ్‌ మాట్లాడుతూ– ‘‘భీష్మ’లో నాకు బాగా నచ్చిన అంశాలు సెకండాఫ్‌లో రెండున్నాయి. ఒకటి వెంకట్‌ మాస్టర్‌ చేసిన ఫైట్‌. రెండు.. జానీ మాస్టర్‌ చేసిన లాస్ట్‌ సాంగ్‌ ‘వాటే బ్యూటీ’. ఈ పాటను  మా ‘బుట్టబొమ్మ’ పాటలా బాగా చేశాడు. ‘జెర్సీ’ తర్వాత నిర్మాత వంశీ మరో మంచి సినిమాని తీసుకువస్తున్నారు’’ అన్నారు.

నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘భీష్మ’ చూసి చాలా సంతోషపడ్డా. ఎంత నవ్వించాలో అంత నవ్వించారు. ప్రేక్షకులు ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తారు. నితిన్‌ డ్యాన్సులు ఇరగదీశాడు. ‘అల.. వైకుంఠపురములో’ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలుసు. ఆ సినిమాతో పోటీపడేలా ‘భీష్మ’ విజువల్స్‌ ఉన్నాయి’’ అన్నారు. ‘‘వెంకీ కుడుముల లేకపోతే నేనిక్కడ ఉండేవాణ్ణి కాదు’’ అన్నారు సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్‌.

వెంకీ కుడుముల మాట్లాడుతూ – ‘‘భీష్మ’ కథకు సమయం పట్టింది. అయితే సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచం’’ అన్నారు. ‘‘ఈరోజు టాలీవుడ్‌లో నేను ఉన్నానంటే ప్రధాన కారణం వెంకీ కుడుముల. ఆయనకు జీవితాంతం మంచి ఫ్రెండ్‌గా ఉంటాను. నితిన్‌ నా  బెస్ట్‌ కో–స్టార్‌ కాదు.. బెస్ట్‌ ఫ్రెండ్‌’’ అన్నారు రష్మికా మందన్నా.

నితిన్‌ మాట్లాడుతూ– ‘‘వెంకీ కుడుముల నాకు, ‘దిల్‌’ సినిమాకు పెద్ద అభిమాని. ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ‘దిల్‌’, ‘సై’ తర్వాత  మళ్లీ అలాంటి యాంగిల్‌లో నన్ను చూపించాడు. నా అభిమానులందరూ ఎప్పుడూ ‘డ్యాన్స్‌.. డ్యాన్స్‌’ అని అడుగుతున్నారు.. ఈ సినిమాలో నా డ్యాన్స్‌ చూసి వారి ఆకలి తీరుతుందనుకుంటున్నా. ఈ సినిమాలో ‘వాటే బ్యూటీ’ సాంగ్‌లో రష్మిక డ్యాన్స్‌ చూసి షాకయ్యా.. చాలా బాగా చేసింది. మా నిర్మాతలు చినబాబు, వంశీ గార్లతో మొదట ‘అఆ’ చేశా..  ఇప్పుడు ‘భీష్మ’ చేశాను.. మూడో సినిమా ‘రంగ్‌ దే’ ఇప్పటికే చేస్తున్నా. నాలుగో సినిమా కోసం నాగవంశీ స్కెచ్‌ గీస్తున్నారు. నా జీవితంలో మా అమ్మానాన్నలు, మా అక్క, పవన్‌ కల్యాణ్‌గారు, త్రివిక్రమ్‌గారు పంచప్రాణాలు.. ఇప్పుడు పెళ్లవబోతోంది కాబట్టి నా భార్య ఆరో ప్రాణం కాబోతోంది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, డైరెక్టర్‌ వెంకీ అట్లూరి, నటుడు బ్రహ్మాజీ, పాటల రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యామ్, నృత్య దర్శకుడు జానీ మాస్టర్, ఫైట్‌ మాస్టర్‌ వెంకట్, సుచిర్‌ ఇండియా కిరణ్, గ్రీన్‌ మెట్రో ప్రతినిధులు అశోక్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు