‘వీవీఆర్‌’... అసలేం జరుగుతోంది..!

14 Jan, 2019 14:54 IST|Sakshi

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ. మాస్ కమర్షియల్‌ చిత్రాల దర్శకుడిగా పేరున్న బోయపాటి, రంగస్థలం సక్సెస్‌తో సూపర్‌ ఫాంలో ఉన్న చెర్రీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కటంతో రిలీజ్‌ కు ముందు నుంచే ఈ మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అయితే సినిమా రిలీజ్‌ తరువాత సీన్‌ మారిపోయింది. ఫస్ట్ షో నుంచి సినిమా మీద ట్రోలింగ్‌ మొదలైంది.

ముఖ్యంగా దర్శకుడు బోయపాటిని టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. కావాలనే కొంతమంది ఇలా సినిమాను ట్రోల్‌చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా మెగా బ్రదర్‌ నాగబాబు, నందమూరి బాలకృష్ణను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్‌, రిలీజ్‌ చేసిన వీడియోస్‌ కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు ఫ్యాన్స్‌. ఒక వర్గం కావాలనే సినిమాను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. సినిమా అనేది టీం వర్క్.. అయినా కేవలం దర్శకుడినే బాధ్యుడిని చేసి విమర్శించటం కరెక్ట్‌ కాదంటున్నారు అభిమానులు.

గతంలో ఇంత బ్యాడ్‌ టాక్‌ వచ్చిన సినిమాలేవి రెండో రోజుకు నిలబడలేకపోయాయి. కానీ చరణ్ ఇమేజ్‌, బోయపాటి స్టామినా కారణంగా వినయ విధేయ రామ మంచి వసూళ్లు సాధించిందంటున్నారు ఫ్యాన్స్‌. బోయపాటి మార్క్‌ మాస్ యాక్షన్‌ తో తెరకెక్కిన ఈ సినిమాకు బీ, సీ సెంటర్స్‌లో మంచి రెస్పాన్స్‌ వస్తుందంటున్నారు. తొలి రోజే దాదాపు 30 కోట్లకు పైగా షేర్‌ సాధించిన ఈ సినిమా చరణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్స్‌లో ఒకటిగా నిలిచింది. అయితే టాక్‌ ప్రభావం రెండో రోజు కలెక్షన్ల మీద కనిపించింది. మరో రెండు రోజులు సంక్రాంతి సెలవులు కావటంతో వసూళ్ల పరంగా సినిమాకు ప్లస్‌ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు