భయపెడుతూనే మెసేజ్‌ ఇచ్చారు – ఎంపీ కవిత

19 Sep, 2018 00:49 IST|Sakshi
నందినీరెడ్డి, రాహుల్‌ రవీంద్రన్, రాంబాబు, పవన్‌ కుమార్, సమంత, కవిత, చిట్టూరి శ్రీనివాస్‌ 

‘‘యు టర్న్‌’ సినిమా నేను చూడలేదు కానీ.. నా పిల్లలు చూసి చాలా బావుందన్నారు. ఓ వైపు భయపెడుతూనే చాలా మంచి మెసేజ్‌ ఇచ్చారు. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయడానికి సమంత భయపడటం లేదు. ‘రంగస్థలం’లో తన పాత్రకు, ‘యు టర్న్‌’లోని పాత్రకు చాలా తేడా ఉంది. తను బ్రిలియంట్‌ యాక్ట్రెస్‌. కొత్త కాన్సెప్ట్‌ సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు’’ అని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమంత ప్రధాన పాత్రలో, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్‌’. పవన్‌కుమార్‌ దర్శకత్వంలో శ్రీనివాస్‌ చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది.

ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌లో సమంత మాట్లాడుతూ– ‘‘నా గత సినిమాలతో పోల్చితే ‘యు టర్న్‌’కి మంచి స్పందన వచ్చింది. సినిమా బావుందని క్రిటిక్స్‌ అభినందిస్తున్నారు. నందినీరెడ్డిగారికి మా సినిమాతో సంబంధం లేకపోయినా నాలుగు రోజులు వచ్చి నాతో కూర్చుని సపోర్ట్‌ చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇక్కడి నుంచి ఇంకా మంచి సినిమాలు, గర్వపడే సినిమాలు చేస్తా’’ అన్నారు. ‘‘సమంత బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇచ్చారు. ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌’’ అన్నారు పవన్‌కుమార్‌. ‘‘సమంత, పవన్‌కుమార్‌ లేకపోతే ఈ సినిమా లేదు. మా చిత్రం ఇంత సక్సెస్‌ కావడం హ్యాపీ’’ అన్నారు శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు. 

మరిన్ని వార్తలు