‘పరుగుల రాణి’గా కత్రినా?!!

24 Apr, 2019 19:41 IST|Sakshi

భాషాభేదాల్లేకుండా ప్రతీ ఇండస్ట్రీలోనూ ప్రస్తుతం బయోపిక్‌ల హవా వీస్తున్న సంగతి తెలిసిందే. సినీ స్టార్స్‌తో పాటు క్రీడాకారుల జీవిత కథలను తెరకెక్కించడంలో ముందుండే బాలీవుడ్‌లో మరో ఆసక్తికర బయోపిక్‌ రూపొందుతున్నట్లు సమాచారం. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా ఇప్పటికే బాక్సింగ్‌ చాంపియన్‌ మేరీ కోమ్‌ బయోపిక్‌లో నటించి నటవిశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇక బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమాలో పరిణీతి చోప్రా నటిస్తున్నారు. ప్రస్తుతం పొడుగు కాళ్ల సుందరి కత్రినా కైఫ్‌ కూడా ఓ బయోపిక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

పరుగులు రాణిగా పేరొందిన అథ్లెట్‌ పీటీ ఉష జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో కత్రినా లీడ్‌ రోల్‌ పోషించనున్నట్లు బీ- టౌన్‌ టాక్‌. తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాలకు దర్శకత్వం వహించిన రేవతి ఎస్‌. వర్మ ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం పీటీ ఉష పాత్రకు ప్రియాంక చోప్రాను సంప్రదించగా.. ఆమె ఈ ప్రాజెక్టును తిరస్కరించిందని.. అందుకే ప్రస్తుతం క్యాట్స్‌తో తెరకెక్కించేందుకు దర్శకురాలు సన్నాహకాలు చేస్తున్నారని వినికిడి. కత్రినా కూడా ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని బీ-టౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కాగా సల్మాన్‌ ఖాన్‌- కత్రినా జంటగా నటించిన భారత్‌ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందే ‘సూర్యవంశీ’ సినిమాలో కత్రినా నటించనున్నారు. ఇక పీటీ ఉష సినిమా కన్ఫామ్‌ అయితే కత్రినా నటించే తొలి బయోపిక్‌గా నిలిచిపోతుంది.

మరిన్ని వార్తలు