చిటపట చినుకులు పాట పాడుతుంటారు

6 Mar, 2019 03:24 IST|Sakshi
టి.సుబ్బరామిరెడ్డి, గంటా శ్రీనివాసరావు, సరోజాదేవి, సుశీల, వాణిశ్రీ, గీతాంజలి

– బి.సరోజాదేవి

‘‘నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే..’ పాట పాడుతూ ఉంటారు. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నేను యన్టీఆర్‌ను అన్నయ్యా అంటాను. ఆ సంభాషణను గుర్తుచేసి మళ్లీ మళ్లీ ఆ డైలాగులు చెప్పమని అడుగుతుంటారు. మరోసారి ఈ విషయాలను గుర్తు చేసుకోవటం ఆనందంగా ఉంది అన్నారు’’ ప్రముఖ నటి బి.సరోజాదేవి. ఆమెకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘విశ్వనట సామ్రాజ్ఙి’ బిరుదును ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా సరోజాదేవి మాట్లాడుతూ– ‘‘సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవటం ఆనందంగా ఉంది’’ అన్నారు. టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకున్న నటి సరోజాదేవి. ఆమెకి తెలుగు ప్రజల తరఫున ప్రదానం చేసిన బిరుదు ఇది’’ అన్నారు. ఈ వేడుకలో ప్రముఖ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు