తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాలి

2 Jul, 2014 00:53 IST|Sakshi
తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాలి

 ‘‘తెలంగాణ ప్రాంతంలో ఎందరో ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నప్పటికీ ఇన్నేళ్లూ వివక్షకు గురయ్యారు. ఇప్పుడు రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి, తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా చిత్ర నిర్మాణం జరగాలి’’ అని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. సంగకుమార్ హీరోగా శ్రీధర్ దర్శకత్వంలో పీవీరావు నిర్మించిన ‘తురుం’ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను మంగళవారం హైదరాబాద్‌లో స్పీకర్ వీక్షించారు.
 
 ఈ సందర్భంగా తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షులు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ -‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణ వారు వివక్షకు గురయ్యారు. ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో ప్రముఖ దర్శక నిర్మాత బి. నరసింగరావు చిత్రపటానికి స్థానం కల్పించకపోవడం అన్యాయం’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ ఏర్పడగానే చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు విజయేందర్‌రెడ్డి, ‘తురుం’ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
 

>