లాక్‌డౌన్‌ కష్టాలు; కారు అమ్మకున్న బుల్లితెర నటుడు

29 May, 2020 10:34 IST|Sakshi

ముంబై : అ‍ప్పటి వరకు సాఫీగా సాగుతున్న జీవితాల్లో లాక్‌డౌన్‌ పెను విధ్వంసం సృష్టించింది. కూలి నాలి చేసుకుని బతికే కుటుంబంలో కనీసం పూట గడవడమే గండంగా మారింది. లక్షల కుటుంబాలు ఆర్థిక సమస్యల వలయంలో కొట్టుమిటాడుతున్నాయి. అయితే ఈ కష్టాలు, ఇబ్బందులు సాధారణ ప్రజల్లో అధికంగా కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం సెలబ్రిటీలను సైతం లాక్‌డౌన్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్‌ పడటంతో ఆదాయం దెబ్బతింది. ఈ క్రమంలో బాలీవుడ్‌ బుల్లితెర నటుడు మానస్‌ షా డబ్బుల కోసం తన కారును అమ్ముకున్నాడు. లాక్‌డౌన్‌ విధించకముందు చివరిసారిగా నటించిన టీవీ షో ‘హమరి బహు సిల్క్‌’కు సంబంధించిన డబ్బు అందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నటుడు ఆవేదన వ్యక్తం చేశాడు. (సమంతకు సారీ చెప్పాలి)

దీనిపై మానస్‌ మాట్లాడుతూ ‘మొదటిసారి నేను సవాలుతో కూడిన‌ పరిస్థిని ఎదుర్కొంటున్నాను. నేను ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్నాను. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి నా కారును అమ్మాల్సి వచ్చింది. అంతేగాక నేను అద్దెకు ఉంటున్న ఇంటిని వదిలి లోఖండ్‌వాలాలో ఉన్న మా బంధువుల ఇంటికి మారాను.’ అంటూ తన భాదను వెల్లడించారు. ‘హమారీ దేవ్రాణి’, ‘సంకత్మోచన్ మహాబలి హనుమాన్’‌ వంటి షోలలో నటించిన మానస్‌‌ ఇలాంటి పరిస్థితి కంటే దారుణంగా ఏమీ ఉండదన్నారు. (నన్ను ఒక్కడూ పిలవలేదు : బాలకృష్ణ )

‘లాక్‌డౌన్‌తో అందరి పరిస్థితి దయనీయంగా మారింది. కేవలం నాకు మాత్రమే కాదు. ఈ వినోద పరిశ్రమలో పనిచేస్తున్న వారందరీ పరిస్థితి ఇలాగే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు మాకు గత చెల్లింపులు అందలేదు. ‘నేను 2019 మే 2 న షూటింగ్‌ ప్రారంబించాను. చివరి షూటింగ్‌ 2019 నవంబర్‌ 5న జరిగింది. మా అందరికీ 2019 మే లో మాత్రమే డబ్బులు చెల్లించారు. ఇది అధికారికంగా సెప్టెంబర్‌లో రావాల్సి ఉంది. కానీ మేము దానిని అక్టోబర్‌లో అందుకున్నాం. అప్పటి నుంచి ఎవరూ ఒక్క పైసా కూడా పొందలేదు. ప్రస్తుతం పని లేదు. ఇక భవిష్యత్తు  ఎలా ఉంటదో తెలియదు’ అని భావోద్వేగానికి లోనయ్యాడు.

మరిన్ని వార్తలు