నటుడు రాజన్‌ సెహగల్‌ కన్నుమూత

13 Jul, 2020 02:26 IST|Sakshi
రాజన్‌ సెహగల్‌

ఈ ఏడాది బాలీవుడ్‌ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. రిషీ కపూర్, ఇర్ఫాన్‌ ఖాన్, సరోజ్‌ ఖాన్, వాజిద్‌ ఖాన్, జగదీప్‌ వంటి స్టార్స్‌ను కోల్పోయింది. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకోవడం ఓ పెద్ద విషాదం. తాజాగా బాలీవుడ్‌ సినీ, టీవీ నటుడు రాజన్‌  సెహగల్‌ (36) అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

బుల్లితెరపై క్రైౖమ్‌ పెట్రోల్, సావధాన్‌  ఇండియా, తుమ్‌ దేనా సాత్‌ మేరా వంటి కార్యక్రమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన రాజన్‌ ఆ తర్వాత బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. ఐశ్వర్యా రాయ్, రణదీప్‌ హుడా నటించిన ‘సరబ్‌జిత్‌’ చిత్రంలో చేసిన రవీంద్ర పాత్ర రాజన్‌కి మంచి గుర్తింపు తెచ్చింది. ‘ఫోర్స్, కర్మ’ వంటి చిత్రాలతో పాటు పంజాబీ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకుల్ని మెప్పించారాయన. రాజన్‌ సెహగల్‌ మృతి పట్ల సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

మరిన్ని వార్తలు