మా ఆయన ఆ నటి గురించి తప్పుగా మాట్లాడలేదు

29 Oct, 2017 12:18 IST|Sakshi

న్యూఢిల్లీ : ఓ కామెడీ షోలో సహ న్యాయనిర్ణేతను ఉద్దేశించి హీరో అక్షయ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. షోలో భాగంగా కంటస్టెంట్స్‌ అద్భుతంగా పర్ఫార్మెన్స్‌ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్‌ను న్యాయనిర్ణేతలు మోగించొచ్చు.

షోకు అక్షయ్‌ కుమార్‌తో పాటు కమెడియన్‌ మల్లికా దువా న్యాయనిర్ణేతలుగా హాజరయ్యారు. ఓ కంటెస్టంట్‌ అద్భుతంగా పర్ఫార్మెన్స్‌ చేయడంతో మల్లికా బెల్‌ను మోగించబోయారు. ఆమెను వారించబోతూ.. మల్లికా జీ మీరు బెల్‌ మోగిస్తే.. నేను మీ బాండ్‌ మోగిస్తాను అంటూ అక్షయ్‌ వ్యాఖ్యానించారు.

దీంతో అక్షయ్‌ మల్లికను ఉద్దేశించి అభ్యంతరకరంగా కామెంట్‌ చేశారంటూ సోషల్‌మీడియాలో దుమారం రేగింది. ఈ విషయంపై స్పందించాలంటూ పలువురు ట్వింకిల్‌ ఖన్నాను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు చేశారు. దీనిపై స్పందించిన ట్వింకిల్‌.. కామెడీ షోలలో ఇలాంటి కామెంట్లు సహజమని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

ఫ్లోలో అలాంటి మాటలు వస్తాయే తప్ప మరే దురుద్దేశం దాని వెనుక ఉండదని అన్నారు. మల్లికా తండ్రి వినోద్‌ దువా హీరో అక్షయ్‌ను ఉద్దేశించి అతనో స్టూపిడ్‌ అని వ్యాఖ్యానించిన దానిపై స్పందిస్తూ.. అక్షయ్‌ ఉద్దేశాన్ని తెలుసుకుని మాట్లాడివుంటే బావుండేదని అన్నారు.

మరిన్ని వార్తలు