వారు ఎక్కడున్నా గుర్తుండిపోతారు..

30 Apr, 2020 20:50 IST|Sakshi

బ్లాక్‌బస్టర్‌ మూవీని గుర్తుచేసుకున్న ట్విటర్‌

ముంబై : బాలీవుడ్‌ దిగ్గజ నటుడు రిషీ కపూర్‌ మరణంతో యావత్‌ సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. చాక్లెట్‌ బాయ్‌ ఇక లేరని పలువురు ప్రముఖులు, అభిమానులు విచారం వెలిబుచ్చారు. రిషీ మరణంతో సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్‌ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. 1989లో బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చాందిని మూవీ ప్రధాన తారాగణంలో ఒకరైన రిషీ కపూర్‌ కనుమరుగవడంతో ఆ మూవీ టీం అంతా భౌతికంగా మనల్ని విడిచివెళ్లినట్లయిందని ఆ ట్వీట్‌ గుర్తుచేసింది.

యష్‌ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీదేవి, రిషీకపూర్‌, వినోద్‌ ఖన్నాలు నటించారు. ఈ మూవీని తెరకెక్కించిన యష్‌ చోప్రా 80 ఏళ్ల వయసులో డెంగ్యూతో అస్వస్ధతకు గురై  2012లో మరణించారు. ఇక చాందినిలో మెరిసిన మరో నటుడు వినోద్‌ ఖన్నా (70)  2017లో క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆయన మరణించిన మరుసటి ఏడాదే దుబాయ్‌లో బాత్‌టబ్‌లో పడి అందాల తార శ్రీదేవి మరణించారు. అప్పటికి శ్రీదేవి వయసు కేవలం 54 సంవత్సరాలే. రిషీ కపూర్‌ మరణంతో చాందిని బృందానికి పలువురు నివాళులు అర్పించారు. చాందినిలో మీ మెరుపులను ఎన్నటికీ మరువబోమని అన్నారు.

చదవండి : ముగిసిన రిషీ కపూర్‌ అంత్యక్రియలు

మరిన్ని వార్తలు