ఇద్దరు అందాల భామలతో ‘సైకో’

5 Sep, 2018 19:13 IST|Sakshi

సాక్షి, తమిళ సినిమా : ఇద్దరు అందాలభామలతో కలిసి ఆడిపాడేందుకు ‘సైకో’ సిద్ధమవుతున్నడు. ఉదయనిధి స్టాలిన్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు మిష్కిన్‌ ‘సైకో’ తెరకెక్కిస్తుండగా.. దీనికి మేస్ట్రా ఇళయరాజా సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో ఉదయనిధికి జోడీగా ఇద్దరు నటించబోతున్నారు. మణిరత్నం కంపెనీ హీరోయిన్‌గా ముద్రపడిన అదితిరావ్‌ హైదరి, సంచలన నటి నిత్యామీనన్‌లే ఉదయనిధితో రొమాన్స్‌ చేయనున్నారు.

వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు మిష్కిన్‌. ఇటీవల తుప్పరివాలన్‌ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఆ మధ్య పిశాచి అనే థ్రిల్లర్‌ కథను సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించారు.  సవరకత్తి అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఇతివృత్తంతో సినిమా రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా సైకో అంటూ భయ పెట్టడానికి మిష్కిన్‌ రెడీ అవుతున్నారు. ఇందులో ఉదయనిధిస్టాలిన్‌ జంటగా అదితిరావ్‌ హైదరి, నిత్యామీనన్‌ను ఎంచుకున్నారు. మరో దర్శకుడు రామ్‌ ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ. శ్రీరామ్, ఇళయరాజా పనితనాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని డబుల్‌ మీనింగ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై అరుళ్‌మొళి మాణిక్యం నిర్మించనున్నారు.

నిర్మాత మాట్లాడుతూ సాధారణ చిత్రాలకు భిన్నంగా మంచి క్లాసికల్‌ చిత్రాలు చేయడంలో దర్శకుడు మిష్కిన్‌ దిట్ట అన్నారు. అదే సమయంలో ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలన్నది తెలిసిన దర్శకుడాయన అని పేర్కొన్నారు. సైకో చిత్రం సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని నిర్మాత అరుణ్‌మొళి మాణిక్యం తెలిపారు. చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని చెప్పారు.

మరిన్ని వార్తలు