ప్రధానిపై మెగా కోడలి సంచలన ట్వీట్‌

20 Oct, 2019 13:20 IST|Sakshi

భారత ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఢిల్లీలోని లోక కళ్యాణ్‌ మార్గ్‌లో #ChangeWithin పేరుతో బాలీవుడ్ సెలబ్రిటీలను కలిసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి షారుఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, కంగనా రనౌత్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ సహా పలువురు సినీ, టెలివిజన్‌ ప్రముఖలు హాజరయ్యారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్‌లో సైతం పంచుకున్నారు. అయితే మోదీ హిందీ ప్రముఖలను మాత్రమే కలవడంపై మెగాస్టార్‌ చిరంజీవి కోడలు ఉపాసన అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఒక్క కళాకారుడికి కూడా ఆహ్వానం అందకపోవటంపై ఆమె అభ్యంతరం తెలిపారు. దక్షిణాది చిత్ర పరిశ్రమను పట్టించుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. 


ఈ విషయంపై ఆమె ప్రధానిని సూటిగా ప్రశ్నించడం.. టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏమందంటే.. ‘ప్రధాని నరేంద్ర మోదీ.. మీరు ప్రధాని అయినందుకు దక్షిణాది ప్రజలు గర్విస్తున్నారు. కానీ మీరు దక్షిణాది కళాకారులను ఖాతరు చేయకపోవటం బాధించింది.  దీన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేసింది. కాగా దక్షిణాది చిత్ర పరిశ్రమను చిన్నచూపు చూడటం అనాది నుంచి వస్తుందే. కానీ ఈ విషయంపై ప్రధానిని గొంతెత్తి ప్రశ్నించిన ఉపాసనకు దక్షిణాది ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుతున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్‌ సంచలనంగా మారింది.

మరిన్ని వార్తలు