మహాబలి

17 Jan, 2018 01:52 IST|Sakshi

బాహుబలి చూస్తిరా? అంతకంటే పెరియ (పెద్ద) సినిమా చూస్తరా? బాహుబలి కంటే మహాబలి లాంటి సినిమాలు ఇండియాలో హాల్‌చల్‌ చేయబోతున్నాయి. బోట్లలో నింపినా సరిపోవు. అన్ని దుడ్లు...  మునుగుతాయా? తేలతాయా?  చూస్తమా?

వెయ్యి కోట్ల భీముడు
భీముడు బలవంతుడా లేక బాహుబలినా! అయినా ఆ పోలికేంటి? భీముడు రియల్‌ క్యారెక్టర్‌. బాహుబలి రీల్‌ క్యారెక్టర్‌ కదా అనుకుంటున్నారా? కరెక్టే. అయితే ఈ ఇద్దరి బలానికి పోలిక పెట్టింది రీల్‌ వైజ్‌గానే. బడ్జెట్‌ వైజ్‌గా ఎవరు పెద్ద అంటే. నిన్న మొన్నటి వరకూ ‘బాహుబలి’ పెద్ద. ఇప్పుడు భీముడే బిగ్‌. ‘బాహుబలి’ రెండు పార్ట్స్‌ బడ్జెట్‌ దాదాపు 300 కోట్లు. మరి భీముడికి అయ్యే బడ్జెట్‌ ఎంతో తెలుసా? 1000 కోట్లండి బాబు. వీఏ శ్రీకుమార్‌ మీనన్‌ దర్శకత్వంలో జ్ఞానపీuŠ‡ అవార్డుగ్రహీత ఎమ్‌టీ వాసుదేవన్‌ నాయర్‌ రాసిన బుక్‌ ఆధారంగా ‘మహాభారతం’పై ఈ సినిమా తీయడానికి బీఆర్‌ శెట్టి అనే బిలియనీయర్‌ రెడీ అయ్యారు. భీముడి క్యారెక్టర్‌ చుట్టూ తిరిగే ఈ సినిమాకయ్యే బడ్జెట్‌ 1000 కోట్లు.

టైటిల్‌ రోల్‌ని మోహన్‌లాల్‌ చేయబోతున్నారు. కర్ణుడి పాత్రలో నాగార్జున కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ విషయం తెలియడానికి ఇంకా టైమ్‌ పడుతుంది. మోహన్‌లాల్‌ మాత్రం భీముడిగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. ‘‘రెండు పార్ట్స్‌గా సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. మొదటి పార్ట్‌ను విడుదల చేసిన, నెక్ట్స్‌ 90 డేస్‌ తర్వాత సెకండ్‌ పార్ట్‌ను రిలీజ్‌ చేస్తాం’’ అని వాసుదేవన్‌ నాయర్‌ అన్నారు. యూనిట్‌ అనుకున్నట్లుగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళితే.. దేశంలో 1000కోట్లతో నిర్మించిన తొలి సినిమా ఇదే అవుతుంది. వెయ్యి కోట్లా? తీసినవాళ్లు, కొన్నవాళ్లు ‘సేఫ్‌’ అవుతారా? అంటే.. టూ పార్ట్స్, మల్టీస్టారర్, మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌.. మునిగే చాన్సే లేదని ఊహించవచ్చు.

500  కోట్ల రామాయణం
రామబాణానికి తిరుగులేదంటారు. అందుకే భీముడు గదతో బాక్సాఫీసు దగ్గరకు వస్తుంటే.. విల్లును ఎక్కుపెట్టి నేనూ వస్తున్నా అంటున్నాడు రాముడు. రామాయణం అంటే సీతను అడవులపాలు చేసిన రాముడు అని ఈతరం వారు అనుకుంటారు. కొందరకి అది కూడా తెలియకపోవచ్చు. ఇలాంటి టైమ్‌లో రామాయణం వస్తే? అబ్బో.. బడ్జెట్‌ బోలెడంత అవుతుంది. అయినా ఓకే అంటూ అల్లు అరవింద్‌ రామాయణం ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. మధు మంతెన, నమిత్‌ మల్హోత్రాలతో కలిసి త్రీ పార్ట్స్‌గా ఆయన ఈ సినిమాని ప్లాన్‌ చేస్తున్నారు.

రాముడు ఎవరంటే రామ్‌చరణ్‌ అట. అంతేకాదు.. మెగా కాంపౌండ్‌కి చెందిన హీరోలు కీలక పాత్రల్లో కనిపిస్తారని టాక్‌. అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు ఇలాంటి వార్తలు హల్‌చల్‌ చేస్తుంటాయి. ఇంతకీ రాముడు ఎప్పుడు కెమెరా ముందుకు వస్తాడు? దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి నో క్లారిటీ. ‘‘రామాయణం వంటి సినిమాను నిర్మించాలంటే ఎంతో బాధ్యతగా ఉండాలి. బిగ్‌ స్రీన్‌పై చూపించడం అంత ఈజీ కాదు. అందుకే పర్ఫెక్ట్‌గా ప్లాన్‌ చేస్తున్నాం’’ అని అల్లు అరవింద్‌ అప్పట్లో అన్నారు. సో... 500 కోట్లు వర్కవుట్‌ అవుతుందా అంటే... త్రీ పార్ట్స్‌ బాస్‌. పైగా పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌ కూడా. రాముడికి తిరుగుండకపోవచ్చు.

300 కోట్ల కర్ణుడు
కర్ణుడి దానగుణం ఎంత గొప్పది? ప్రాణాలనైనా తృణప్రాయంగా ఇచ్చేంత గొప్పది. మరి కురుక్షేత్ర రణరంగంలో దుష్టులైన కౌరవుల వైపు ఎందుకు ఉండాల్సి వచ్చింది? పాండవులకు కర్ణుడు ఎందుకు వ్యతిరేకం అయ్యారంటే చరిత్ర తెలుసుకోవాలి. మలయాళ దర్శకుడు ఆర్‌. ఎస్‌. విమల్‌ ఆ పని మీదే ఉన్నారు. విక్రమ్‌ టైటిల్‌ రోల్‌లో ఆయన ‘మహావీర్‌ కర్ణ’ అనే సినిమా తీయబోతున్నారు. 300 కోట్ల రూపాయలతో యునైటెడ్‌ ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ‘‘రెండేళ్లుగా స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నా. కొన్ని సీన్లు రీ–రైట్‌ కూడా చేశా. తమిళ్, హిందీ భాషల్లో తీసి, మిగతా భాషల్లో డబ్‌ చేయాలనుకుంటున్నాం. ఇంటర్‌నేషనల్‌ లెవల్లో యాక్టర్స్‌ అండ్‌ టెక్నీషియన్స్‌ని తీసుకోబోతున్నాం’’ అన్నారు విమల్‌. డైరెక్టరే చెప్పేశారుగా.. ఇంటర్నేషనల్‌ లెవల్‌ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అని.. ఇంకేం? బొమ్మ మునిగే చాన్సే లేదు.

400  కోట్ల రోబో
ఇండియన్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్‌ రికార్డుల గురించి చెప్పుకోవాలంటే ప్రజెంట్‌ బాహుబలి, దంగల్‌ వసూళ్ల నుంచి స్టార్ట్‌ చేయాలి. ‘‘హలో... ఫ్యూచర్‌లో మా గురించి కూడా చెప్పుకుంటారు’’ అంటున్నారు ‘2.0’ టీమ్‌. ‘రోబో’కి సీక్వెల్‌గా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌ డేట్స్‌లో కాస్త అయోమయంగా ఉన్నా కలెక్షన్స్‌ విషయంలో ఫుల్‌ క్లారిటీతో దూసుకెళ్లేలా మార్కెట్‌ను రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే వంద కోట్లకు పైగా శాటిలైట్‌ రైట్స్‌ను దక్కించుకున్నారు. రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీజాక్సన్‌ ముఖ్యతారలుగా సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇండియన్‌ సినిమాల్లో ఇప్పటికి ఇది హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీ. ఆల్రెడీ శాటిలైట్, ఇతర హక్కుల రూపంలో 150 కోట్లు వచ్చేశాయట. రోబో మునిగే చాన్సే లేదు. టోటల్‌ కలెక్షన్స్‌ మిగతా సినిమాలకు షాక్‌ ఇస్తాయేమో! వెయిట్‌ అండ్‌ సీ.

250 కోట్ల సంఘమిత్ర
బాక్సాఫీసుపై యుద్ధం చేయడానికి భీముడు, రాముడు, కర్ణుడు రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు తలపడటానికి ఓ రాణి రెడీ అవుతోంది. పేరు... సంఘమిత్ర. 250కోట్ల ఖర్చుతో దండయాత్రకు రెడీ అవుతున్నారు సంఘమిత్ర. లేడీని నమ్మి 250 కోట్లు ఖర్చుపెడుతున్నారా? అంటే.. హలో... ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘డర్టీ పిక్చర్‌’, ‘క్వీన్‌’.. ఇలా చాలా సిన్మాలున్నాయి. ఒకట్రెండు మినహా అన్నీ ఆల్‌మోస్ట్‌ లాభాలు తెచ్చినవే. ఆ ఒకటీ రెండూ సినిమాలూ ‘భేష్‌’ అనిపించుకున్నాయి.  ఇక.. ‘సంఘమిత్ర’ గురించి చెప్పాలంటే.. ముందు శ్రుతీహాసన్‌ ఒప్పుకుని ఆ తర్వాత తప్పుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులకు సీన్లోకి దిశా పాట్నీ వచ్చారు. సుందర్‌.

సి దర్శకత్వంలో తేనాండాళ్‌ ఫిలమ్స నిర్మిస్తున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్య కీలక పాత్రలు చేయనున్నారు. ఎప్పుడో అనౌన్స్‌ చేసినా ఇంకా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కకపోవడంతో సంఘమిత్ర దండయాత్రకు స్టార్టింగ్‌ ప్రాబ్లమా? అనే డౌట్స్‌ వచ్చాయి. సినిమా లేట్‌ అవుతున్నది స్టార్టింగ్‌ ప్రాబ్లమ్‌ వల్ల కాదని, ప్రిపరేషన్‌ ప్లాన్‌ వల్ల అని అంటున్నారు చిత్రబృందం. ‘‘ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. స్క్రిప్ట్‌కి చాలా టైమ్‌ పట్టింది. చిన్న చిన్న మార్పులు చేస్తున్నాం. గ్రాఫిక్‌ వర్క్‌ ఆల్రెడీ స్టార్ట్‌ అయ్యింది. ఏప్రిల్‌ లేదా మేలో షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం’’ అని సుందర్‌ సి. స్పష్టం చేశారు. ఇది ట్రైలింగ్వుల్‌ మూవీ. పెట్టిన పెట్టుబడిని ‘సంఘమిత్ర’ సునాయాసంగా లాగేస్తుంది సారూ.

సోనమ్‌ భారతం
బీటౌన్‌లో మహాభారతం సినిమాపై మోస్ట్‌ ఇంట్రస్టెడ్‌ యాక్టర్‌ ఎవరంటే.. ఆమిర్‌ ఖాన్‌ అని చెప్పేయొచ్చు. మరి.. యాక్ట్రస్‌ విషయానికొస్తే సోనమ్‌ కపూర్‌. భారతంలో నటించడానికి ఆమిర్‌ ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు సోనమ్‌ కపూర్‌ అయితే ఏకంగా ఈ నేపథ్యంలో వచ్చిన పుస్తకాల రైట్స్‌ కూడా కొనేశారు. మహాభారతంపై ‘ఆర్యావతార క్రానికల్స్‌’ అనే టైటిల్‌తో మూడు పార్ట్స్‌గా బుక్‌ రచించారు ఉదయశంకర్‌. అందులో ఫస్ట్‌ పార్ట్‌ ‘గోవింద’ రైట్స్‌ను సోనమ్‌ కపూర్‌ కొన్నారు. దీంతో మహాభారతంపై సినిమా తీయడానికి సోనమ్‌ రెడీ అయ్యారన్న వార్తలు వచ్చాయి. ‘‘మహాభారతం గొప్ప కథ. ఇందులో ఏ క్యారెక్టర్‌ చేస్తానో ప్రస్తుతం నాకు తెలీదు’’ అని సోనమ్‌ పేర్కొన్నారు. సో.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళితే బడ్జెట్‌ రెండు వందల కోట్ల పైనే ఉంటుందని ఊహించవచ్చు.

200 కోట్లకు దగ్గరగా..
ఆల్రెడీ విడుదలకు సిద్ధమైన చిత్రాల్లో ‘పద్మావత్‌’ బడ్జెట్‌ దాదాపు 180 కోట్లు అని బాలీవుడ్‌ టాక్‌. దీపికా పదుకోన్‌ ముఖ్య పాత్రలో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్‌ అవుతోంది. ఇప్పటికే పలు వివాదాలు, పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

రెండో ఇండియన్‌ @ 180 కోట్లు
శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటించిన ‘భారతీయుడు’ అప్పట్లో ఓ సంచలనం. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ ని ప్లాన్‌ చేస్తున్నారు. కమల్‌ నటిస్తారు. శంకర్‌ తెరకెక్కిస్తారు. ‘దిల్‌’ రాజు తీస్తారనే వార్త వచ్చింది. అయితే ‘దిల్‌’ రాజు తప్పుకున్నారు. ఫస్ట్‌ పార్ట్‌ నిర్మించిన ఎ.యం. రత్నం నిర్మించడానికి రెడీగా ఉన్నారట. ఇక, శంకర్‌ ప్లాన్‌ చేయడం, కమల్‌ డేట్స్‌ లాక్‌ చేయడమే ఆలస్యం. ఈ చిత్రానికి 180 కోట్లు బడ్జెట్‌ అవుతుందట. ‘భారతీయుడు’పై ఉన్న క్రేజ్‌ సీక్వెల్‌కి వర్కవుట్‌ అవు తుంది. సో.. రెండో భారతీయుడు వసూళ్లు ఇరగదీస్తాడని అంచనా వేయొచ్చు.

మరిన్ని వార్తలు