హ్యాట్రిక్‌కి వర్మ రెడీ!

13 Nov, 2017 01:24 IST|Sakshi

దర్శకుడిగా విరించి వర్మ వయసు నాలుగేళ్లే. తీసింది రెండు సినిమాలే. అయితేనేం... రెండూ హిట్సే. అతను తీసిన తొలి సినిమా ‘ఉయ్యాలా జంపాలా’ హీరోగా రాజ్‌ తరుణ్‌కి మంచి పునాది వేయడంతో పాటు లో బడ్జెట్‌లో మంచి సినిమాలు తీయాలనుకునే నిర్మాతలకు ధైర్యాన్ని ఇచ్చింది! నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వం వహించిన రెండో సినిమా ‘మజ్ను’ మంచి హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ దర్శకుడు ముచ్చటగా మూడో సినిమా తీయడానికి రెడీ అయ్యారు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎం.ఎల్‌. కుమార్‌చౌదరి సమర్పణలో కీర్తీ కంబైన్స్, పద్మజా పిక్చర్స్‌ సంస్థలు నిర్మించనున్నాయి. ‘‘యూత్‌ఫుల్, లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథను విరించి వర్మ రెడీ చేశారు. తెలుగులోని ప్రముఖ యువహీరో ఈ సినిమాలో నటిస్తారు. ఆయనెవరు? ఇందులోని మిగతా నటీనటులు ఎవరు?  సాంకేతిక నిపుణులు ఎవరు? అనే వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని కుమార్‌చౌదరి తెలిపారు.

మరిన్ని వార్తలు