వలయం ట్రైలర్‌ బాగుంది

10 Feb, 2020 03:25 IST|Sakshi
లక్ష్, అడవి శేష్, రమేష్‌

– అడవి శేష్‌

‘‘స్నేహం, బంధుత్వం కన్నా నేను ప్యాషన్నే ఎక్కువ నమ్ముతాను. ఆ ప్యాషన్‌ ఉంటేనే ఇండస్ట్రీలో మనందరం ఉంటాం అని నమ్ముతాను’’ అన్నారు అడవి శేష్‌. లక్ష్, దిగంగనా సూర్యవంశీ జంటగా రమేష్‌ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వలయం’. చదలవాడ శ్రీనివాసరావు సమర్పణలో పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ట్రైలర్‌ను విడుదల చేసిన అడవి శేష్‌ మాట్లాడుతూ– ‘‘లక్ష్‌లో ప్యాషన్‌ ఉంది. అది ట్రైలర్‌లో కనిపిస్తోంది.. ‘వలయం’ ట్రైలర్‌ నచ్చింది. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

‘‘వలయం’ అనేది సమిష్టి కృషి. మా నాన్న నాకు ఓ చాన్స్‌ ఇచ్చారు. ఆయన సపోర్ట్‌ లేకపోతే మళ్లీ వచ్చేవాణ్ని కాదు. నా మిత్రుడు శేష్‌ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నాను’’ అని లక్ష్‌ అన్నారు. ‘‘లక్ష్‌ పెద్ద హీరోగా పేరు తెచ్చుకుంటే సంతోషం.. మంచి కొడుకుగా ఉంటే ఇంకా సంతోషం’’ అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. ‘‘అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, లక్ష్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు రమేష్‌ కుడుముల. దర్శకులు కేయస్‌ నాగేశ్వరరావు, నాగు గవర, చంద్ర మహేశ్, నిర్మాత శోభారాణి, నటుడు రవి ప్రకాశ్, సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర మాట్లాడారు.

మరిన్ని వార్తలు