ఇతరుల విషయాల్లో తలదూర్చకండి

1 Jul, 2020 08:06 IST|Sakshi

చెన్నై : ఇతరుల విషయంలో తలదూర్చకండి అంటూ నటి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్‌కు నటి వనితా విజయ్‌ కుమార్‌ సూచించారు. అసలు విషయం ఏమిటంటే నటి వనిత ఇటీవలే పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని అదే రోజు పీటర్‌ మొదటి భార్య ఎలిజబెత్‌ హెలెన్‌ ఆయనపై వడపళని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై లక్ష్మీ రామకృష్ణన్‌ స్పందించారు. వనితను పీటర్‌ పాల్‌ వివాహం చేసుకునే వరకు ఆయన మొదటి భార్య చూస్తూ ఎందుకు ఉందని, అప్పటివరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని, ఇప్పుడు డబ్బు కోసమే ఆమె ఫిర్యాదు చేసిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. వనిత చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఈ బంధం అయినా ఆమె నిలుపుకుంటారని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. లక్ష్మీ రామకృష్ణన్‌ వ్యాఖ్యలపై వనిత విజయ్‌ కుమార్‌ ఘాటుగా స్పందించారు. (మూడో పెళ్లి చేసుకున్న న‌టి; ఫోటోలు వైర‌ల్‌)

‘దంపతులుగా జీవిస్తున్న ఇద్దరు ఎందుకు విడిపోతున్నారో, ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో మీకు తెలుసా..? మీకు తెలియని విషయంపై ఆసక్తి చూపించాల్సిన అవసరం లేదు. నేను ఎవరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడంలేదు కాబట్టి, మీరు ఈ విషయంలో తలదూర్చటం ఆపేయాలి. మీకు తెలియని ఒక వ్యక్తి గురించి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరం లేద’ని సూచించారు. తాను తెలిసో తెలియకో ఈ వ్యవహారంలో చిక్కుకున్నానని, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తనకు తెలుసని అన్నారు. ఇతరుల సలహా గానీ, సహాయం గానీ తనకు అవసరం లేదని నటి వనిత స్పష్టం చేశారు. (విడాకులు ఇవ్వకుండానే మ‌రో పెళ్లా?)

మరిన్ని వార్తలు