ఆమె రూటే సెపరేటు..

11 Feb, 2018 18:33 IST|Sakshi

సాక్షి, చెన్నై: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ రూటే సెపరేటు. ఆటైనా, పాటైనా, హీరోయిన్‌గానైనా, ఆ మాటకొస్తే అతిథి పాత్రలో మెరవడానికైనా, ప్రతినాయకిగా మారడానికి రెడీ అంటారీ భామ. హీరో శింబుతో కలిసి రొమాన్స్‌ చేసిన తొలి చిత్రం పోడాపోడీ పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు. అందుకే రాశి లేని నటి అనే ముద్ర పడింది. అయినా డోంట్‌కేర్‌ అంటూ నటిగా ముందుకు సాగిన ఆమెకు బాలా చిత్రం తారైతప్పట్టేలో తన సత్తా చాటుకునే అవకాశాన్ని కల్పించింది.

ఆ చిత్రం ప్రేక్షకాదరణను అంతగా పొందకపోయినా వరలక్ష్మీ నటనకు మాత్రం కోలీవుడ్‌ ఫిద్యా అయ్యిపోయింది. ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఒక్క తమిళంలోనే మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అందులో ఒకటి ధనుష్‌తో కలిసి నటిస్తున్న మారి-2 చిత్రం. ఈ సినిమాలో సాయిపల్లవి, టోవినో థామస్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరిగింది. వీరిలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రతినాయకిగా కనిపించనున్నారట. ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

ఒకవైపు నచ్చిన పాత్రల్లో నటిస్తూ, మరోవైపు మహిళా హక్కుల కోసం, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పోరుడుతున్నారు. అందుకు సేవ్‌ శక్తి పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి మహిళలకు నేనున్నానంటూ భరోసానిస్తున్నారు. ఇలా తన రూటే వేరు అంటూ సహ హీరోయిన్లలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు.

మరిన్ని వార్తలు