మరో జన్మంటూ ఉంటే...

28 Apr, 2019 08:23 IST|Sakshi

మళ్లీ జన్మంటూ ఉంటే కచ్చితంగా పోలీసు ఆఫీసర్‌గానే పుడతానంటున్నారు నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. శింబుకు జోడీగా పోడాపోడీ సినిమాతో హీరోయిన్‌గా కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారామె. గ్లామర్‌ రోల్స్‌కే పరిమితమై పోకుండా విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తనను వరించిన పాత్రలకు తనదైన శైలిలో జీవం పోసి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీ.. ధనుష్‌ నటించిన మారి 2 సినిమాలో ఐఏఎస్‌గా ఆకట్టుకున్నారు. తాజాగా ‘రాజపార్వై’ అనే సినిమాలో ఐపీఎస్‌గా నటించినట్లు ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

అందరికీ ధన్యవాదాలు..
‘ మరో జన్మంటూ ఉంటే కచ్చితంగా పోలీసు అవ్వాలనుకుంటున్నాను. వృత్తిని ఎంతగానో ప్రేమించే నాకు.. విభిన్న పాత్రలు ఇస్తున్న దర్శకులకు ధన్యవాదాలు. అలాగే ఏ క్యారెక్టర్‌ చేసినా నన్ను అంగీకరిస్తున్న నా అభిమానులకు కూడా కృతఙ్ఞతలు. మీ అందరి ప్రోత్సాహంతో మరిన్ని విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తా అంటూ రాజపార్వై సినిమాలో పోలీసు గెటప్‌లో ఉన్న ఓ వీడియోను వరలక్ష్మీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇందుకు బదులుగా... ‘ పోలీసు ఆఫీసర్‌గా నటించేందుకు మీరే కరెక్ట్‌ పర్సన్‌. ఐపీఎస్‌ అనే కాదు ఏ పాత్రలోనైనా మీరు అవలీలగా ఒదిగిపోగలరు. పోలీస్‌గా.. పక్కా పొలిటిషియన్‌గా, విలన్‌గా మెప్పించడంలో మీకు మీరే సాటి అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కెరీర్‌ ప్రారంభం నుంచి వైవిధ్యభరితమైన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్న వరలక్ష్మీ.. విశాల్‌ సండైకోళి, విజయ్‌ సర్కార్‌ సినిమాల్లో విలన్‌గా తనదైన శైలిలో అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు