వరూ నా భాండాగారం!

14 May, 2018 08:50 IST|Sakshi

చెన్నై: హీరోయిన్‌ వరలక్ష్మి తనకు దక్కిన భాండాగారం అని అన్నది ఎవరో తెలుసా? ఎస్‌.మీరు ఊహించింది కరక్టే. అలా అన్నది హీరో విశాల్‌నే. నడిగర్‌ సంఘం కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్షుడుగా బాధ్యతాయుతమైన పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, మరో పక్క కథానాయకుడిగా, నిర్మాతగా విజయాల బాటలో పయనిస్త్ను స్టార్‌ విశాల్‌. తాజాగా అతడు నటించి నిర్మించిన ఇరుంబుతిరై  తెరపైకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది.

హీరో విశాల్‌, వరలక్ష్మి మధ్య ప్రేమ, పెళ్లి అంటూ చాలా రకాల ప్రచారమే జరుగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా విశాల్, వరలక్ష్మి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం వైరల్‌ అయ్యింది. అలాంటిది  ఇటీవల మిస్టర్‌ చంద్రమౌళి చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో ఈ సంచలన జంట పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం ఈ కార్యక్రమంలో అందరినీ ఆకర్షించింది. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విశాల్‌ ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన భేటీ చూద్దాం.

‘సహాయ దర్శకుడిగా  సినీ జీవితాన్ని ప్రారంభించిన నాలో నటుడిని చూసింది అర్జున్‌నే. ఆ తరువాతే చెల్లమే చిత్రంలో హీరోగా పరిచయం అయ్యాను. నేను సహాయ దర్శకుడిగా పని చేసినప్పుడు తీసుకున్న తొలి వేతనం కేవలం 100 రూపాయలే. హీరోగా పరిచయమైన తరువాత మొదట్లో కమర్శియల్‌ చిత్రాలు చేశాను. అదే బాటలో పయనించకూడదన్న ఆలోచనతోనే బాలా దర్శకత్వంలో అవన్‌ ఇవన్‌ చిత్రంలో నటించాను. ఆ చిత్రం నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగని పేరు కోసమే చిత్రాలు చేయకూడదని, వైవిధ్యభరిత కథా చిత్రాలను చేయడానికి ఆసక్తి చూపుతున్నాను. తదుపరి నవ దర్శకుడితో చిత్రం చేయనున్నాను. ఆ చిత్రం సమాజంలోని ఒక ముఖ్య సమస్య గురించి చర్చించేదిగా ఉంటుంది. నా జీవితంలో స్నేహితులకు ముఖ్య భాగం ఉంటుంది.

మనలోని కొరతలను చెప్పేది వారే. అలా నాకు లభించిన పెద్ద భాండాగారం మిత్రులే. అలా  వరలక్ష్మీ కూడా నాకు దక్కిన భాండాగారమే. తను నాకు 8 ఏళ్ల నుంచే తెలుసు. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. వరలక్ష్మీ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఆమెలో ఆత్మవిశ్వాసం మెండు. నా తప్పులను ఎత్తి చూపి మార్గదర్శిగా ప్రోత్సహించిన ఆమె నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి, అత్యంత సన్నిహితురాలు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌. మంచి చెడు అంతా ఆమెతో పంచుకుంటాను. నా ప్రధాన లక్ష్యం దక్షిణ భారత నటీనటుల సంఘం భవన నిర్మాణం.’ అని తెలిపాడు.

మరిన్ని వార్తలు